దేశం కానీ దేశంలో కొడుకు మరణించడం ఒక విషాదమైతే.అతని కడసారి చూపు కోసం కన్నవారు తొమ్మిది నెలలుగా ఎదురుచూడటం మరింత దురదృష్టకరం.నిర్మల్ జిల్లా సిర్గాపూర్ అనే గ్రామానికి చెందిన 55 ఏళ్ల కడిలే పాపన్న అనే రైతు కుమారుడు కడిలే చందు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ వ్యవసాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
2019 జూన్ 28న దక్షిణ సౌదీ అరేబియాలోని మారుమూల గ్రామంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్కు గురై మరణించాడు.ఈ విషాద వార్త తెలుసుకున్న అతని భార్య హేమలత పోస్ట్మార్టం, బకాయిలు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలతో పాటు తన భర్త మృతదేహాన్ని భారతదేశానికి పంపాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు.అయితే పోస్ట్మార్టం ప్రక్రియ సౌదీ అరేబియాలో మూడు నెలల నుంచి ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని దౌత్య వర్గాలు తెలిపాయి.
భారత రాయబార కార్యాలయ అధికారులు, స్థానిక పోలీసులు రియాద్ నగరానికి 610 కిలోమీటర్ల దూరంలో చందు మరణించిన ప్రాంతానికి చేరుకుని అతని యజమానిని సంప్రదించారు.అంతేకాకుండా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సాయంతో ఈ కేసును నిరంతరం పర్యవేక్షించి ఎట్టకేలకు పోస్ట్మార్టం నివేదికను సంపాదించారు.
అయితే పోస్ట్మార్టం నివేదికతోనే అన్ని పనులు అయిపోవు.చందు మృతదేహాన్ని భారతదేశానికి పంపాలంటే అతని యజమాని రసాయన ఎంబామింగ్, రవాణా ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.
కానీ యజమాని తన పనుల్లో బిజీగా ఉండటంతో పాటు దేశంలోని మరో ప్రాంతంలో ఉన్నాడు.చందు కోసం అతని యజమాని నిధులు ఏర్పాటు చేయనిదే అతని మృతదేహం భారత్కు వెళ్లే పరిస్ధితి లేదు.దీంతో అతని మృతదేహం ఇంకా మార్చురీలోనే ఉంది.మరోవైపు చందు మరణించిన నేపథ్యంలో అతనికి చేయాల్సిన చివరి కర్మల కోసం అతని కుటుంబం ఎదురు చూస్తోంది.తండ్రి పాపన్న కటింగ్, సేవింగ్ చేయించడం లేదు.అతని రక్త సంబంధీకుల ఇళ్లలో జరగాల్సిన పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి.
చందు భార్య హేమలత పరిస్థితి దారుణంగా తయారైంది.ఈ నేపథ్యంలో పాపన్న కుటుంబం తమ బిడ్డ మృతదేహం ఎప్పుడొస్తుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.