కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుపోయారు.నాలుగు గోడలు దాటి బయట కాలుపెట్టలేని పరిస్ధితి.
ఇందులో భారతీయులు సైతం ఉన్నారు.వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన భారతీయులు లాక్డౌన్ పుణ్యమా అని పరాయి గడ్డపై చిక్కుకుపోయారు.
అప్పటి నుంచి స్వదేశానికి వచ్చేందుకు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు.వీరి ఎదురుచూపులు ఫలించి ఎన్ఆర్లు, భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఇప్పటికే కొన్ని వేలమందిని స్వదేశానికి తీసుకొచ్చారు.అయితే మరికొందరు మాత్రం ఇంకా విదేశాల్లోనే ఉన్నారు.
ప్రభుత్వం నడుపుతున్న విమానాలు ఏమాత్రం సరిపోకపోవడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకున్న సుమారు 800 మంది కాశ్మీరీలు భారతదేశానికి వచ్చేందుకు గాను తమకు తాముగా ఛార్టర్డ్ విమానాలు ఏర్పాటు చేసుకున్నారు.
అయితే శ్రీనగర్లో ల్యాండ్ అయ్యేందుకు భారత ప్రభుత్వ అనుమతి ఇక్కడ ప్రతిబంధకంగా మారింది.ఉద్యోగాలు కోల్పోయి తాము దుబాయ్లో సమస్యలను ఎదుర్కొంటున్నందున తమను కాశ్మీర్ లోయకు తరలించాలని కాశ్మీరీలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వీరిలో కొందరు అత్యవసర వైద్యం, వీసా సమస్యలు, మరికొందరు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ కింద దుబాయ్కు ఒక విమానమే నడుస్తోందని సాజద్ అహ్మద్ అనే కాశ్మీరీ వాపోయాడు.కరోనా వైరస్ కారణంగా తాను పనిచేస్తున్న సంస్థ నా వీసాను రద్దు చేసిందని.మూడు నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో తన వద్ద చిల్లిగవ్వ లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
అందువల్ల తామంతా కలిసి ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు ఛార్టర్డ్ విమానాలను బుక్ చేసుకున్నామని, అవి జూన్ 9,10 తేదీల్లో దుబాయ్ నుంచి శ్రీనగర్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని అమీర్ రఫీక్ అనే మరో కాశ్మీరీ చెప్పాడు.అయితే దుబాయ్ నుంచి వచ్చే ఈ విమానాలు శ్రీనగర్లో ల్యాండ్ అయ్యేందుకు భారత ప్రభుత్వ అనుమతి రావాల్సి వుందని అతను పేర్కొన్నాడు.
దీనిపై శ్రీనగర్ విమానాశ్రయానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.దుబాయ్ నుంచి వచ్చే విమానాలు ఇక్కడ ల్యాండ్ అవ్వాలంటే కేంద్ర విదేశీ వ్యవహారాలు , రక్షణ, పౌర విమానయాన, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల అనుమతి తప్పనిసరని అన్నారు.
ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కావడం, అనుమతులు రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో తెలియకపోవడంతో కాశ్మీరీలు ఆందోళన చెందుతున్నారు.