న్యూఢిల్లీ: పిల్లలపై కరోనా ప్రభావం గురించి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) దడపుట్టించే నివేదిక వెలువరించింది.దీని ప్రకారం భారతదేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులలో కనీసం 80 శాతం మంది విద్యార్థులకు అభ్యసన స్థాయిలు తగ్గినట్లు వెల్లడించింది.కోవిడ్-19 అంటువ్యాధి సమయంలో పాఠశాలలు మూసివేసినందున విద్యార్థులలో అభ్యసన స్థాయిలు క్షీణంచినట్లు నివేదికలో పేర్కొంది.కరోనా కారణంగా పాఠశాలల మూసివేతలతో దక్షిణాసియాలోని పిల్లలకు అభ్యసన అవకాశాలలో ఆందోళనకరమైన అసమానతలను సృష్టించాయని స్పష్టం చేసింది.
భారతదేశంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 42 శాతం మంది పాఠశాల మూసివేత సమయంలో ఎలాంటి దూర విద్యను ఉపయోగించలేదని నివేదిక వెల్లడించింది.
పుస్తకాలు, వర్క్ షీట్లు, ఫోన్ లేదా వీడియో కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, వీడియో తరగతులు మొదలైనవాటిని వినియోగించుకోలేదని నివేదిక పేర్కొంది.
ఇప్పుడు పాఠశాలలను సురక్షితంగా ప్రారంభించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని యూనిసెఫ్ ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.అవసరమైతే ఆన్లైన్ మాధ్యమంలోనైనా పిల్లలకు విద్యను అందించేలా చూడాలని సూచించింది.
శ్రీలంకలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో 69 శాతం మంది తమ పిల్లలు కరోనా కారణంగా చదువుకు దూరమయ్యారని చెప్పారని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది.పాకిస్తాన్లోని 23 శాతం విద్యార్థులకు వారి విద్యకు దోహదపడేలా ఏ పరికరాలూ అందుబాటులో లేవని నివేదికలో వెల్లడయ్యింది.