కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.పేద,ధనిక వంటి ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు.
మాంసం ఫ్యాకింగ్ ప్లాంట్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 730 మంది సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపింది.ఈ ఘటన జర్మనీ లో చోటుచేసుకుంది.
జర్మనీకి చెందిన నార్త్ రైన్-వెస్ట్ఫాలియా (ఎన్ఆర్డబ్ల్యూ)లోని ఓ వధశాలలో ఇది జరిగింది.దీంతో అంతా ఉలిక్కిపడ్డారు.
ఒకేసారి ఇంత మందికి కరోనా అని తేలడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.మాంసం ప్యాకింగ్ ప్లాంట్లో ఏకంగా 730 మంది సిబ్బందికి కరోనా సోకడం తో వారందరిని ఐసోలేషన్కు తరలించారు.
ఏడు వేల మంది ఉద్యోగులను క్వారంటైన్ చేశారు.అంతేకాకుండా ప్లాంటును తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తుంది.
ఈ విషయం తెలిసిన వెంటనే టోనీస్ గ్రూప్ మీట్ ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సప్లై చేసిన మాంసం తిన్న వారు కూడా ఆందోళన చెందుతున్నారు.ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు.
ఈ నెల 29 వరకు స్కూళ్లు, డేకేర్ కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు.స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
వేగంగా పరీక్షలు జరిపి కరోనా రోగులను గుర్తించేందుకు సిద్ధమయ్యారు.
కాగా ఈ ప్లాంటులో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనేది మాత్రం అర్ధం కావడం లేదు.
దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.ఇటీవల కోస్ఫెల్డ్ జిల్లాకి చెందిన మరో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్లో 200 మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మరో ప్లాంట్ లో 730 మందికి కరోనా సోకడం మరింత కలకలం రేపింది.