హైదరాబాదీయుల దుస్థితి ఏమని చెప్పాలి? ఓ పక్క ఇది విశ్వనగరమంటూ పాటలు పాడుకుంటున్నాం.ఉత్తమ నగరమంటూ జబ్బలు చరుచుకుంటున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను స్వర్గధామం చేస్తానంటున్నారు.విదేశీ నగరాల్లా తీర్చిదిద్దుతామంటున్నారు.
నాయకులు తమ మాటల మాయాజాలంతో సమస్యల గురించి ఆలోచించనివ్వకుండా చేస్తున్నారు.ప్రజలను కలల్లో విహరింపచేస్తూ బాధలను మర్చిపోయేలా చేస్తున్నారు.
హైదరాబాద్ ప్రజల్లో డెబ్బయ్ శాతం మంది ప్రతి రోజూ గంటసేపు ఇరుకుగా ఉన్న, పాడైపోయిన రోడ్ల మీద, వాయు, శబ్ద కాలుష్యాల మధ్య ప్రయాణం చేస్తున్నారని ఓ అధ్యయనం తెలియచేసింది.రాండమ్గా గంట సేపు అని చెప్పారుగాని కొన్ని గంటలపాటు కాలుష్యంలో ప్రయాణిస్తున్నారనేది వాస్తవం.
హైదరాబాదులో వాహనాలు ఎంత అడ్డదిడ్డంగా పోతాయో చాలామందికి అనుభవం.నిర్లక్ష్యపు డ్రైవింగ్, వాహనాలను వేగంగా నడపడం మొదలైన కారణాలవల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
విదేశీ నగరాల్లో మాదిరిగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ నియంత్రించే పద్ధతులు మన దగ్గర లేవు.ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు సమయానికి చేరుకోవాలని తొందరపడుతుంటారు.
సాయంత్రం ఆఫీసు వదిలాక త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆత్ర పడుతుంటారు.ఈ హడావిడిలో రోడ్డు నిబంధనలు పాటించడంలేదు.
తప్పుడు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించకుండా, రోడ్లు బాగు చేయకుండా హైదరాబాదును విశ్వనగరమని పొగుడుకుంటే చాలదు.