కరోనా కారణంగా మందుబాబులకి చాలా కష్టం అయిపొయింది.మద్యం దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు.
ఏపీలో అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచేయడంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నాటుసారా వైపు మళ్ళీ దృష్టి పెడుతున్నారు.డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని రహస్యంగా నాటుసారా తయారు చేసే వాళ్ళు ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగారు.
మరో వైపు మద్యానికి బానిస అయినా వారికి ఆల్కహాల్ దొరకకపోవడంతో వారు రకరకాల రసాయనాలు తాగేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి శానిటైజర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీనిని చేతులకి రాసుకోవడానికి ఉపయోగించాలని డాక్టర్లు సూచించడంతో అందరూ కొనుగోలు చేసుకుంటున్నారు.అయితే ఇందులో ఆల్కహాల్ ఉంటుందని ప్రచారం జరగడంతో మందుబాబులు శానిటైజర్ తాగేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు.కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.మద్యం దుకాణాలు లేకపోవడంతో యాచకులు, స్థానికులు శానిటైజర్ ను తాగారు.వీళ్లు అందరూ మందుకి బానిసై రోజు శానిటైజర్ తాగుతున్నట్లు తెలుస్తుంది.
నిన్న అర్ధరాత్రి ముగ్గురు మరణించగా, ఇవాళ మరో నలుగురు మృతి చెందారు.మరణించినవారు అనుగొండ శ్రీను బోయ, భోగేమ్ తిరుపతయ్య, గుంటక రామిరెడ్డి, కడియం రమణయ్య, కొనగిరి రమణయ్య, రాజారెడ్డి గా గుర్తించారు.