ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయన్న విషయం తెలిసిందే.ఇలాంటిదే మరో షాకింగ్ న్యూస్ ఫేస్బుక్ యూజర్ల కోసం రెడీగా ఉందట.
ఈ తాజా సమాచారం ఏంటంటే.ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ బోట్ ద్వారా 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు అమ్ముడవుతున్నాయట.
మదర్బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమైనాయని, ఇందులో సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్ నెంబర్లు కూడా ఉన్నాయట.
ఈ విషయం 2019 లో ఫేస్బుక్లో లీక్ అయిన ఒక పాచ్ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తాజా సమాచారమట.
అదీగాక యూజర్కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయిందట.ఇక ఈ సమాచారం పై సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ అందర్ని అప్రమత్తం చేశారని ఈ నివేదిక తెలిపింది.
మరోవైపు అటు ఫేస్బుక్ గానీ, ఇటు టెలిగ్రామ్ గానీ ఈ నివేదికపై అధికారికంగా స్పందించలేదని సమాచారం.ఇప్పటికే యూజర్లు వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ విధానంపై మండిపడుతుండగా, సీఏఐటీ సుప్రీంకోర్టును, వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్బుక్ను దేశంలో నిషేధించాలని ఆశ్రయించింది.
ఇప్పటికే వినియోగదారుల డేటా విక్రయంపై ఇబ్బందుల్లో ఉన్న ఫేస్బుక్కు తాజా పరిణామంతో మరిన్ని చిక్కులు తప్పవని తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న సందర్భంలో ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ విషయం యూజర్లను మరింతగా అందోళనకు గురిచేస్తుందట.