శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా శ్రీకారం.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న శర్వానంద్ కి కూడా మంచి హిట్ దొరికినట్లు అయ్యింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.
సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు.వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా అద్బుతమైన కాన్సెప్ట్ తో ఉమ్మడి వ్యవసాయం అంటూ వచ్చిన ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ జాబు వదిలేసి వ్యవసాయం చేయడానికి సొంతూరు వెళ్ళిపోయిన యువకుడు పాత్రలో శర్వానంద్ నటించాడు.
జాతిరత్నాలు వేవ్ లో శ్రీకారం సినిమా కలెక్షన్స్ తగ్గినా కూడా చిత్రం చూసిన ప్రతి ఒక్కరు మంచి ఫీల్ తో బయటకి వచ్చేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. మహర్షి తర్వాత వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వచ్చిన శ్రీకారం సినిమాకి ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కూడా లభించాయి.
వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాల బాట పట్టండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా శ్రీకారం చిత్రం ఉందని ప్రశంసించారు.కుటుంబం, ఊరు కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శకనిర్మాతలకు, నటీనటులకు శుభాకాంక్షలు అంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో, ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్లవచ్చు అనే సందేశాన్ని శ్రీకారం చిత్రం అందిస్తోందని వివరించారు.యువత చూడదగిన చక్కని చిత్రం శ్రీకారం అని కొనియాడారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ప్రశంసించడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.