మన దేశంలో నరకానికి నకళ్లు అనేకం ఉన్నాయి.ప్రభుత్వ రంగంలోని ప్రతి సంస్థ, ప్రతి కార్యాలయం నిర్లక్ష్యానికి నిలుట్టద్దాలుగా ఉన్నాయి.‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే దశాబ్దాల క్రితం నాటిది.కాని ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం, ప్రయివేటు ఆస్పత్రుల్లో దోపిడీ.ఈ రెండింటి మధ్య సామాన్య జనం నలిగిపోతున్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుల శిశువును ఎలుకలు కరిచి దారుణంగా చంపాయి.ఈ వార్త చదివాక, ఆ ఫొటో చూశాక ఎంతటి రాతి గుండె మనిషైనా కరిగిపోకతప్పదు.
ఆ శిశువు కన్నవారికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా బిడ్డతో సమానమవుతుందా? ఒడిశాలోని కటక్ ప్రభుత్వ ఆస్పత్రలో కేవలం రెండు వారాల్లో అరవై ఒక్క మంది శిశువులు చనిపోయారు.ఎంత దారుణం? ఈ ప్రపంచాన్ని చూడాల్సిన, గొప్పగా ఎదగాల్సిన పసికందులు పసి మొగ్గలుగానే రాలిపోయారు.పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాల్సిన పిల్లల ఆస్పత్రిలో ఇంతమంది చనిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.కత్తితో పొడిస్తేనే హత్య కాదు.గొంతు పిసికితేనే హత్య కాదు.తుపాకీతో కాల్చితేనే హత్య కాదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీయడం కూడా హత్యే.ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించిన కారణంగానే అరవై ఒక్కమంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
కన్నవారికి కడుపు కోత మిగిల్చారు.ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ జరుపుతోంది.
ముగ్గురు సిబ్బంది వ్యవహార శైలిపై దర్యాప్తు సాగుతోంది.ఐదుగురు వర్కర్లను సస్పెండ్ చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఎఎస్ నాయక్ తెలిపారు.అయితే తమది నిర్లక్ష్యం కాదని, ఆస్పత్రిలో పరికరాలు, వసతులు, సౌకర్యాలు లేవని డాక్టర్లు, వైద్యులు చెబుతున్నారు.
ఈ వాదనను కూడా తీసేయలేం.ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యానికి తోడు సౌకర్యాలు, పరికరాలు, మందుల కొరత కూడా ఉంటుంది.
గ్రామీణ ఆస్పత్రి మొదలు రాజధానిలో ఉండే ఆస్పత్రి వరకూ ఇదే సీన్.పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్న పిల్లలు చాలామంది చనిపోయారు.
మన దేశంలో పాలకులు ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు బాగు చేయరో ఇప్పటికీ అర్థంకాని విషయం.అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.
కాని అది నిజం కాదు.కోట్లు కొల్లగొడుతున్నారు.