అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవడం వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ఇమ్మిగ్రేషన్ విధానం.డొనాల్డ్ ట్రంప్ వలస వాదులపై అనుసరించిన పాలసీపై విదేశీయులు, సెటిలర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు.చివరికి కోర్టుల్లో మొట్టికాయలు తిన్నా ట్రంప్ లెక్కచేయకుండా నెలకొక కొత్త నిబంధన తీసుకొచ్చేవారు.దీంతో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకొస్తానని బైడెన్ హామీ ఇచ్చారు.తీరా అధ్యక్ష ఎన్నికల్లో జో గెలవడంతో వలస విధానంపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ మొదలైంది.
ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్ 4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చిన పని అనుమతుల కాలపరిమితిని పెంచాలని కోరుతూ 60 మంది అమెరికా చట్టసభ్యులు బైడెన్కు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వలస విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల (భార్యా లేదా భర్త)తో పాటు 21 ఏళ్ల లోపు పిల్లలకు.అమెరికా ప్రభుత్వం హెచ్ 4 వీసాలు జారీ చేస్తుంటుంది.అయితే తొలుత హెచ్ 4 వీసాదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు.దీంతో హెచ్-1 బీ వీసాదారులపై ఆర్థికభారం అధికంగా ఉండేది.దీంతో హెచ్ 4 వీసాదారులు కూడా చట్టపరంగా ఉద్యోగం చేసుకునేలా వర్క్ పర్మిట్కు అవకాశం కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అయితే ట్రంప్ అధికారంలోకి రాగానే హెచ్ 4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్ కోర్టుకు తెలిపారు.
హెచ్ 1 బీ వీసాదారుల భాగస్వాముల్లో భారతీయ మహిళలదే అగ్రస్థానం.ఈ నేపథ్యంలో వీరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ్యులు బైడెన్ను కలిశారు.
హెచ్ 4 వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతోమంది విదేశీ మహిళలు.వైద్యంతో పాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చట్టసభ్యులు తెలిపారు.ప్రస్తుత దేశం క్లిష్టపరిస్థితుల్లో వున్నందున వారి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు.