జమ్మూ అండ్ కాశ్మీర్ లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.దీనికి సంబందించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.
తొలిసారిగా లోక్సభకు ఎన్నికై హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా సభలో చేసిన తొలి ప్రతిపాదన ఇదే.భద్రతా పరిస్థితుల దృష్ట్యా అమర్నాథ్ యాత్ర తర్వాత జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు.అందువల్ల జులై 3 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడగించడం ఆవశ్యమని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా ఈ తీర్మానానికి సభ్యులు మద్దతివ్వాలని కోరారు.అంతేగాక.గవర్నర్, రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రంలో ఉగ్రదాడులు తగ్గాయని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు.
దీంతో పాటు జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును కూడా ఆయన ప్రవేశపెట్టారు.ఈ బిల్లుతో అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, నియంత్రణరేఖ, వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దులకు 10కిలోమీటర్ల దూరంలో నివసించే ప్రజలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఈ సవరణ బిల్లు ఉపయోగపడుతుంది అని, దీని వల్ల రాష్ట్రంలోని 3.5లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని షా పేర్కొన్నారు.