ఏపీలో అధికారం ఎవరికీ దక్కబోతోంది ? టీడీపీనా, వైసీపీనా అంటూ లెక్కలు బయటకి వస్తున్న తరుణంలో జనసేన పార్టీని ఎవరూ పరిగణలోకి తీసుకోవడమే లేదు.కొన్ని కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలో రాబోతుంది అని చెబుతుండగా మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీ అధికారం దక్కించుకుంటుంది అని లెక్కతేలుస్తున్నాయి.
కానీ జనసేనను ఈ రేసులో లేనట్టుగానే సర్వే సంస్థలు భావిస్తుండడం ఆ పార్టీ వర్గాలకు నచ్చడం లేదు.అందుకే స్వయంగా ఆ పార్టీ నాయకులే తమకు మెజార్టీ స్థాయిలో సీట్లు రాబోతున్నాయి, ,మే 23 వరకు వేచి ఉండండి అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం అయితే చేస్తోంది.
పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఆ పార్టీ కీలక నాయకులు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఈ విషయాలనే చెప్పుకొస్తున్నారు
ఇక ఏపీలో అనేక సర్వేల లెక్కల ప్రకారం జనసేన పార్టీకి కేవలం నాలుగు ఐదు సీట్లు మాత్రమే రాబోతున్నాయి అంటూ లెక్కతేలిస్తే మరొకొన్ని14-22 అసెంబ్లీ సీట్లు, రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి.కానీ జనసేన నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తూ ఏపీలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు.అధిక స్థాయిలో అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని…అలాగే 5 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు
తాజాగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం స్ట్రాంగ్గా చెబుతున్నారు.బుధవారం గాజువాక నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి గంగాధరంతో పాటు విశాఖపట్టణం, నర్సాపురం లోక్సభ అభ్యర్థులు జేడీ లక్ష్మీనారాయణ, నాగబాబు అటెండ్ అయ్యారు.ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ జనసేన పార్టీ విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్ సభ స్థానాల్లో గెలవబోతోందని, మిగతా స్థానాల్లోనూ గట్టి పోటీ ఇచ్చిందని ఇంకా సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ధీమాగా చెప్పుకొచ్చేశారు.అయితే ఈ ప్రకటనపై మిగతా రాజకీయ పార్టీలు వ్యంగ్యంగా స్పందిస్తున్నాయి.