ప్రేమ అనే తలంపు రాగానే మనకు మొదట గుర్తొచ్చేది తాజ్ మహల్.ప్రేమకి చిహ్నంగా భావించే తాజ్ మహల్ ని షాజహాన్,తన భార్య ముంతాజ్ ప్రేమ జ్నాపకార్ధంగా నిర్మించాడు.
అప్పట్లో రాజులు తమ భార్యల ప్రేమ గుర్తుగా స్మారకాలను నిర్మించేవారు.దానికి చక్కటి ఉదాహరణే తాజ్ మహల్…అయితే తర్వాత రాజులు పోయారు,రాజ్యాలు పోయాయి.
కానీ ప్రేమ మాత్రం ఎప్పటికి సజీవంగా ఉంది.షాజహాన్ తరహాలోనే ఒక ఉపాధ్యాయుడు తన భార్య ప్రేమకు గుర్తుగా ప్రేమ మందిరాన్ని నిర్మించాడు… దాని ప్రారంభోత్సవానికి అన్ని ఊర్లు తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు.
ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన మోటూరి భైరవస్వామి,సత్యవతి ల కాపురం ఏడాది క్రితం వరకు సజావుగా సాగింది.భైరవస్వామి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవాడు.సత్యవతి గృహిణిగా కుటుంబ బాద్యతలు నెరవేర్చేది.
భార్య ప్రేమానురాగాలతో అటు కుటుంబాన్ని ,ఇటు ఉద్యోగాన్ని చూసుకునే భైరవస్వామి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డును పొందారు.అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంపై విధి అనారోగ్యం రూపంలో వచ్చి సత్యవతిని తీసుకుపోయింది.దీంతో ఆమె ఎడబాటును తట్టుకోలేని భైరవస్వామి భార్య కోసం ఏమైనా చేయాలని ఆలోచించి , చివరకి తన జ్ఞాపకార్థం ప్రేమ మందిరాన్ని నిర్మించాడు.దీనికి మొత్తం మూడున్నరలక్షల వరకు ఖర్చు పెట్టాడు…
ప్రేమమందిరం నిర్మించడమే కాదు.
ఇంటిటింకి తిరిగి స్వయంగా ఆహ్వాన పత్రికలు పంచాడు.‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించండి’ అని కోరాడు.
రెండుమూడేండ్లకు విడాకులకు అప్లై చేస్తున్నారు నేటి యువత.అయితే సుమారు 55ఏళ్లపాటు కలిసి బతికి,భార్య మరణించాక కూడా తనను మర్చిపోలేకపోతున్న భైరవస్వామి లాంటి వారూ ఉన్నారు.
సత్యవతి చనిపోయాక అవయవదానం కోసం ఆమె పార్థివదేహాన్ని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి అప్పగించారు.సత్యవతి భౌతికంగా దూరమైనా అవయవదానంతో సత్యవతి గారు సజీవంగా ఉన్నారని చెప్పాలి…
.