నిత్యం ఎన్నో వేధింపులు, గృహ హింస వంటి కేసులు నమోదవుతున్నా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎన్ఆర్ఐ అల్లుల్లపై మోజు మాత్రం తీరడం లేదు.ఇలాంటి వారికి కేంద్ర విదేశాంగ శాఖ షాకిచ్చే న్యూస్ చెప్పింది.2016 నుంచి ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ భర్తలు విడిచిపెట్టడం, వేధించడం, మోసం చేయడం, చిత్రహింసలకు గురి చేశారంటూ 5,298 మంది మహిళలు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.దేశంలోని ఈ జాబితాలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ లిస్ట్లో టాప్లో ఉన్నాయి.
వీటిలో జీవిత భాగస్వాములు తమను విడిచిపెట్టారని వారి ఎక్కడున్నారో తెలుసుకుని అప్పగించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.జీవిత భాగస్వామి నుంచి ఆర్ధిక సాయం, విడాకులు, పిల్లలను అప్పగించాలని కోరడం వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
వివిధ దేశాల్లో స్థిరపడిన వారి వివరాలు సరిగా లేనప్పటికీ.ఉన్న కొద్దిపాటి సమాచారాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ ప్యానెల్కు సమాచారం ఇచ్చింది.అధికారిక సమాచారం మేరకు కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేల నుంచి ఎక్కువ ఫిర్యాదులు నమోదవుతుండగా… గల్ఫ్ దేశాల నుంచి అతి తక్కువ కేసులు నమోదవుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
రాష్ట్రాల వారీగా వస్తే 763 కేసులతో పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా.
ఆ తర్వాత యూపీ (501), మహారాష్ట్ర (468), ఢిల్లీ (436), రాజస్ధాన్ (371), కర్ణాటక (341) ఉన్నాయి.సిక్కిం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ నుంచి అసలు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
అదే సమయంలో మేఘాలయ, త్రిపుర నుంచి ఒక్కొ కేసు నమోదయ్యాయి.
ఎన్ఆర్ఐ భర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్లు 2019’’కి కొద్దిరోజుల క్రితం పార్లమెంట్ స్థాయి సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం ఎన్ఆర్ఐ పురుషుడు తమ వివాహం జరిగిన 30 రోజుల్లోపు దానిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి.ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎన్నారై పాస్పోర్ట్ రద్దయిపోతుంది.
వివిధ కుటుంబ చట్టాల ప్రకారం ఎన్ఆర్ఐ వివాహాలను డేటాబేస్లో ఉంచడం శుభపరిణామమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం బాధిత మహిళల సమస్యలను పరిష్కరించేందుకు గాను సింగిల్ విండోస్ మెకానిజంగా ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీ (ఐఎన్ఏ)ని ఏర్పాటు చేశారు.
ఇది నిందితులైన ఎన్ఆర్ఐలపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో పాటు వారిని పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తుంది.