తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.ఎనిమిదేళ్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
గతంలో రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి.తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి పెంచే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
అయితే అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో బీజేపీ అతి ఉత్సాహాన్ని చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం అసెంబ్లీ సీట్లు భారీగా పెంచుతోందని.
అలా పెంచితే చిన్న నియోజకవర్గాలలో గెలిచి అధికారం చేపట్టవచ్చని కమలం పార్టీ ఆశిస్తోందని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు ఏపీలోనూ 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఎవరికి లాభం చేకూరుతుందనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో బీజేపీకి చిన్న నియోజకవర్గాలు ఉపయోగపడిన తరహాలో ఏపీలో జనసేనకు ఈ అంశం కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు వైసీపీకి 225 సీట్లు గెలవడం అంటే కత్తి మీద సాము లాంటిదే అని విశ్లేషిస్తున్నారు.
అయితే ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో వారికి కొత్త సీట్లను కేటాయించవచ్చని వివరిస్తున్నారు.
మరోవైపు ఏపీలో పొత్తు రాజకీయాలు నడుస్తుండటంతో ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే 225 సీట్లలో తాము ఎక్కువ సీట్లలో పోటీ చేయవచ్చని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.జనసేన విషయానికి వస్తే 225 సీట్లలో పోటీ పెట్టడం కష్టతరంగా మారుతుంది కాబట్టి టీడీపీకి ఈ విషయం కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది.అటు వామపక్షాలకు కూడా అసెంబ్లీలో కాలు పెట్టడానికి సీట్ల పెరుగుదల కచ్చితంగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కొసమెరుపు ఏంటంటే.తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో ఉండదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేయడం గమనార్హం.