స్వతంత్ర భారతావనికి అదొక చీకటి రోజు.47 ఏళ్ళ క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.ప్రజల హక్కులన్నీ హరించారు.ప్రతిపక్ష నేతలందరినీ జైళ్ళలో నిర్బంధించారు.పత్రికలపై ఉక్కుపాదం మోపారు.21 నెలల పాటు దేశంలో అరాచకం రాజ్యమేలింది.1977 ఎన్నికల్లో ఇందిర ఓటమితో ఎమర్జెన్సీ రద్దయింది.స్వతంత్ర భారతదేశంలో అత్యంత విషాదకర ఎమెర్జెన్సీ ప్రకటించి 47 సంవత్సరాలైంది.దేశంలో ప్రజల హక్కులన్నీ హరించివేసి, పత్రికా స్వేచ్ఛను నిషేధించి, ప్రతిపక్ష నేతలందరినీ జైళ్ళలో కుక్కింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం.1971లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.నాటి ఎన్నికల్లో గరీభీ హఠావో నినాదమిచ్చిన ఇందిర.కాంగ్రెస్ పార్టీలో తన వ్యతిరేకులందరినీ మట్టి కరిపించి అపూర్వ విజయం సాధించారు.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేత రాజ్ నారాయణ్ మీద ఇందిర విజయం సాధించారు.అయితే ఇందిరాగాంధీ ఓటర్లను ప్రలోభపరిచి, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగ పరిచి తన మీద గెలిచారని రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు బెంచ్…1975 జూన్ 12వ తేదీన తీర్పు వెలువరించింది.
లోక్ సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచింది నిజమే అని నిర్థారణ అయినందున ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది.
మరో ఆరేళ్ళ వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదని కూడా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది.హైకోర్టు తీర్పును ఇందిరాగాంధీ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అక్కడా చుక్కెదురైంది.
నాటి రాజకీయ సంక్షోభం నుంచి, తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులనుంచి బయట పడటానికి గాను ఇందిరాగాంధీ దేశంలో ఎమెర్జెన్సీ ప్రకటించారు.రాజ్యాంగంలోని 352వ అధికరణాన్ని అడ్డుపెట్టుకుని, దేశానికి లోపలి నుంచి బయటి నుంచి ప్రమాదం పొంచి ఉందని చెబుతూ 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
నాటి రాష్ట్రపతి ఫకృద్ధీన్ అలీ అహ్మద్ ఎమెర్జెన్సీ ఉత్తర్వుల మీద సంతకం చేశారు.
తర్వాత రెండు నెలలకు రాష్ట్రపతి ఉత్తర్వులను కేంద్ర మంత్రివర్గంలోను, పార్లమెంట్ లోను ఆమోదించారు.ఎమెర్జెన్సీని అడ్డుపెట్టకుని దేశంలో ప్రజల హక్కులన్నీ కాలరాసారు.పీడీ యాక్ట్, అంతర్గత భద్రతా చట్టం ఉపయోగించి జయప్రకాశ్ నారాయణ, మురార్జీ దేశాయ్, వాజ్ పేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్, రాజ్ నారాయణ్ వంటి నాటి అగ్ర నాయకులందరినీ జైళ్ఝలో పెట్టారు.
దేశ వ్యాప్తంగా ప్రనతిపక్షాల్లో యాక్టివ్ ఉండే కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ జైళ్ళలో కుక్కారు.పత్రికలపై తీవ్ర ఆంక్షలు విధించారు.ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా అడ్డుకున్నారు.21 నెలల పాటు దేశంలో చీకటి పాలన కొనసాగింది.ప్రజలను అనేకరకాలుగా ఇబ్బందుల పాల్జేశారు.
దేశంలో జనాభా పెరుగుతోందంటూ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.పెళ్ళికాని యువకుల్ని కూడా బలవంతంగా తీసుకెళ్ళి ఆపరేషన్లు చేశారు.సంవత్సరం 9 మాసాల పాటు సాగిన అరాచక పాలనకు 1977 మార్చిలో తెర పడింది.అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోగా…జనతా పార్టీ పాలన మొదలైంది.1971లో ఇందిరాగాంధీ మీద ఓడిపోయిన రాజ్ నారాయణ్…జైలు నుంచే రాయబరేలీలో ఇందిర మీద ఘన విజయం సాధించారు.ఇందిర కక్ష గట్టి జైళ్ళలో పెట్టిన నాయకులందరూ లోక్ సభలో అడుగు పెట్టారు.