భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని మన పాలకులు ప్రచారం చేస్తుంటారు.అంతరిక్ష ప్రయోగాలలో మనమే టాప్ అని చెబుతుంటారు.
అది సాధించామని, ఇది సాధించామని అదే పనిగా చెబుతుంటారు.ఎంత అభివృద్ధి సాధించినా ఏం ప్రయోజనం? ఇప్పటికీ దేశంలో బాల్య వివాహాల పీడ వదలలేదు.ఈ దురాచారాన్ని ఇప్పటివరకు రూపు మాపలేకపోయారు పాలకులు.
దేశంలోని ఆడపిల్లల్లో ఇప్పటికీ 47 శాతం మందికి 18 ఏళ్ళ లోపలే వివాహాలు జరుగుతున్నాయి.ఈ విషయాన్ని ప్రసిద్ధ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలియచేసింది.ఇంతేకాదు బాల్య వివాహాలు చేసుకుంటున్న అమ్మాయిలపై విపరీతంగా శారీరక, లైంగిక హింస జరుగుతోంది.
లాన్సెట్ కమిషన్ 14 దేశాల్లో అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికలో ఆంద్ర ప్రదేశ్ పేరూ ఉంది.దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఏపీ ఉంది.
ఈ రాష్ట్రంలో అమ్మాయిల్లో 71 శాతం మందికి 18 ఏళ్ల వయసు కంటే ముందే పెళ్లి జరుగుతోంది.బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే మిగతా రాష్ట్రాలు… మధ్యప్రదేశ్ (73 శాతం) రాజస్థాన్ (68 శాతం) బిహార్ (67 శాతం) యూపీ (64 శాతం) ఇది తాజా నివేదికే కాబట్టి విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను లెక్కలోకి తీసుకొని ఉంటారు.