ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.
జైల్లో గడుపుతున్నారు.కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు.
తాజాగా దుబాయ్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన డాక్టర్ సురీందర్ పాల్ సింగ్ ఒబెరాయ్ సంచలన విషయాలను బయటపెట్టారు.పంజాబ్కు చెందిన 70 మందితో సహా భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది మహిళలు యూఏఈ, ఒమన్లలో చిక్కుకున్నారని తెలిపారు.పక్షం రోజుల క్రితం మస్కట్లోని భారత రాయబారి అమిత్ నారంగ్తో వీరిని తిరిగి స్వదేశానికి పంపడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించినట్లు సురీందర్ పాల్ వెల్లడించారు.ఈ ఏడాది ఆగస్ట్లో ప్రధాని నరంద్ర మోడీని కలిశానని, ఇక్కడి బాధిత మహిళల పరిస్ధితిని ఆయనకు వివరించానని ఆయన పేర్కొన్నారు.
అలాగే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కూడా కలిశానని.మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయినందున ఆయన అమ్మాయిల కష్టాలను పూర్తిగా అర్ధం చేసుకున్నారని సురీందర్ సింగ్ చెప్పారు.
ఒమన్, యూఏఈలలోని అధికారులతో ఈ విషయంపై చర్చిస్తానని పూరీ తనకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
యూఏఈ వీసా పొందడం చాలా సులభమని.
అందుకే భారతీయ మహిళలు ఎక్కువగా అక్కడికే వెళ్తారని సురీందర్ చెప్పారు.ఆ తర్వాత వారు రోడ్డు మార్గంలో మస్క్ట్కు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు.
తాను చెప్పిన 400 మంది మహిళలు కాకుండా.కొన్ని వందల మంది భారతీయులు ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నారని, కానీ తమ బాధలు చెప్పడానికి ముందుకు రావడం లేదని సురీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.