ఆడపిల్లకు ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.
ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.
తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.
తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.
ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.భార్యలను వదిలేస్తామని బెదిరింపులకు పాల్పడిన 382 ఎన్నారై భర్తల పాస్పోర్టులను రద్దు చేసినట్లు భారత ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో తెలిపింది.2015 నుంచి ఇప్పటివరకు ఇలా 382 పాస్పోర్టులను రద్దు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.అలాగే ఇటువంటి కేసులలో ఇప్పటి వరకు 216 మంది మహిళలు ప్రభుత్వం నుండి న్యాయ, ఆర్థిక సహాయం కోరినట్లు వెల్లడించింది.కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ ఈ వివరాలు తెలిపింది.
కాగా ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ- 1 ప్రభుత్వం ఓ గట్టి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి చేసుకున్న ఏడు రోజుల్లోగా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెళ్లిళ్లను అధికారికంగా నమోదు చేసుకోవాలని, అలా చేయని పక్షంలో వారికి పాస్పోర్టులు, వీసాలు జారీచేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.
విదేశాల్లో ఉంటూ, తమ విలాసవంతమైన జీవనశైలితో ఇక్కడి వారిని ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితభాగస్వామిని వదిలివేయటం లేదా వారిని వేధించడం వంటి పలు ఉదంతాలు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో కేంద్రం వీటిపై దృష్టి సారించింది.