మానవ శరీరంలోని ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనది.ఏ అవయవం యొక్క పనితీరు సరిగా లేకపోయినా గాని మన శరీరం మన మాట వినదు.
మన శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసి, మూత్రాన్ని తయారుచేసే మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.సాధారణంగా మానవులలో కుడి వైపు ఒక కిడ్నీ ఎడమ వైపు ఒక కిడ్నీ ఉంటాయి.
రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ పాడయినా మరొక కిడ్నీతో ప్రాణాలు కాపాడుకోవచ్చు.కానీ రెండు కిడ్నీలు పాడైతే మాత్రం బతకడం చాలా కష్టం.
ఇలా రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్యూర్ అయితే జీవితాంతం వైద్య సాయంతోనే బతకాల్సి ఉంటుంది.లేదంటే డయాలసిస్ గాని, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ గాని చేయించుకుంటే బతుకుతారు.
కానీ ఒక మహిళ రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాగానీ కేవలం ఆరువారాల్లోనే రికవరి అయ్యి బతికి బట్టకట్టింది.
నిజంగా వైద్య చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అని చెప్పాలి.
అసలు వివరాల్లోకి వెళ్తే.డిసెంబర్ నెలలో ఒక 30 ఏళ్ల మహిళ పాము కాటుకు గురై పుణెలోని నోబుల్ ఆసుపత్రిలో జాయిన్ అయింది.
కాగా ఆ మహిళ హాస్పిటల్లో జాయిన్ అయ్యే సరికే ఆమె శరీరంలోని కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వలన ఆమె శరీరం పూర్తిగా వాచిపోయింది.దీంతో ఆమెను వెంటనే ఐసీయూలో చేర్చి రక్తపరీక్షలు చేయగా ఆమె రక్తంలో ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తేలింది.
అలాగే ఆమె పాము కాటుకు గురవ్వడంతో హెమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (HUS) అనే అరుదైన జబ్బు బారిన పడిందని నోబుల్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ ప్లాంట్ వైద్యుడు డాక్టర్ అవినాష్ ఇగ్నేషియస్ వెల్లడించారు.
హెచ్యూఎస్ (HUS) అనే అరుదైన సిండ్రోమ్ వలన ఆమె కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేశాయి.రెండు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో ఆమె ఆరు వారాలపాటు డయాలసిస్ పైనే ఆధారపడింది.తదనంతరం కిడ్నీల సమస్య నుంచి పూర్తిగా రికవర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వైద్య చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు.డయాలసిస్ జరిగిన ఆరు వారాల్లో ఆమె మూత్ర విసర్జన మెరుగుపడిందని, ఆ తరువాత డయాలసిస్ను నిలిపివేశాం అని వైద్యులు చెబుతున్నారు.
ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని ఆమెకు ఇప్పుడు డయాలసిస్ అవసరం లేదు అని డాక్టర్ ఇగ్నేషియస్ పేర్కొన్నారు.