ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం ,వైసీపి పార్టీలు ఇద్దరికీ ఎంతో ప్రధానమైనది…ఈ గెలుపుతోనే భవిష్యత్తులో పార్టీల మనుగడ ఆధారపడి ఉంది.అందుకే పార్టీ గెలుపుకోసం ఏ ఒక్క అవకాశం వచ్చినా సరే వదులుకోవడానికి సిద్దంగా లేరు ఇరు పార్టీ నేతలు.
అన్ని రకాలుగా శక్తియుక్తులు కూడా గడుతున్నారు.ఈ క్రమంలోనే ప్రధాన అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గెలుపు పై కసరత్తులు చేస్తోంది.
అందులో భాగంగానే అభ్యర్ధుల విషయంలో రాజీపడటం లేదు.పార్టీలో ఎంత చరిత్ర ఉన్నది ముఖ్యం కాదు ప్రజలలో ఆయా నేతలకి ఎంత పేరు ఉంది ప్రజాదరణ ఉందా లేదా అనేకోణంలో లోనే ఆలోచిస్తున్నారు.
అయితే చంద్రబాబు ఎప్పటికప్పుడు చేయించుకునే సర్వేల ప్రకారం చూస్తే.పార్టీలో 30 మంది సిట్టింగు ఎమ్మెల్యేల ఫీడ్ బ్యాక్ చాలా దారుణంగా వచ్చిందని తెలుస్తోంది.అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు సుమారు 40 మంది సిట్టింగులపై వేటు వేస్తారు అని తెలిసినపుడు ఆ 40 మందిని పిలిపించుకుని మరీ క్లాస్ పీకారట.దాంతో మలి సర్వేలో 10 పని తీరు బాగుందని అయితే సుమారు 30 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగోలేదని ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని తెలిపారు…అయితే.
ఈ 30 మంది సిట్టింగు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారట అంతేకాదు వారి ప్లేస్ లో కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది.పార్టీ కి ఎంతటి వీర విధేయులు ఆ లిస్టు లో ఉన్నా సరే వారిని క్షమించేది లేదని తేల్చి చెప్పేశారట బాబు.
అయితే ఈ సర్వేల సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్టు దక్కుతోందో లేదో అనే భయం ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి దడ పుట్టిస్తోంది.
అయితే చంద్రబాబు కూడా ఈ సిట్టింగుల విషయంలో భయపడుతున్నారని టాక్ ఎందుకంటే.ఈ 30 మందిని కాదు అంటే ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో తమ బలగాలతో రెబల్స్ గా తయారయితే తెలుగుదేశానికి కోలుకోలేని దెబ్బ పడుతుందనే బెంగ పట్టుకుందట.
అందుకే చంద్రబాబు వారితో ముఖాముఖి కార్యక్రం పెట్టి మరీ వారిని సుతి మెత్తగా హెచ్చరించి టిక్కెట్టు ఇవ్వడం కుదరదని చెప్తూనే పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతామని చెప్పనున్నారట.అప్పటికీ వారు వినకపోతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు.
అయితే ఎవరి పేర్లు ఈ హిట్ లిస్టు లో ఉన్నాయో అంటూ సిట్టింగు ఎమ్మెల్యేలు తెగ ఆందోళన చెందుతున్నారు.