తమ ఉత్పత్తులు అమ్ముకునే కంపెనీలు ప్రజలను ఏవిధంగా మభ్యపెడతాయో, మాయ మాటలతో ప్రలోభపెడతాయో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నాయి.అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి.
ఈ పథకం వల్ల ఇంత లాభమని, ఆ పథకం వల్ల అంత లాభమని నమ్మబలుకుతున్నాయి.అంటే వ్యాపారం చేసుకునే కంపెనీలకు, పరిపాలన సాగించే ప్రభుత్వాలకు మౌలికంగా తేడా లేదని అర్థమవుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.కొత్త భూసేకరణ బిల్లు కారణంగా దేశంలోని ౩౦ కోట్ల మంది భూమిలేని ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెబుతోంది మోదీ ప్రభుత్వం.
కొన్ని రోజుల కిందట లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు.ఈ భూ సేకరణ బిల్లు పేదలకు, రైతులకు వ్యతిరేకమైందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
కాని ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు విషయంలో యమ పట్టుదలగా ఉంది.ఈ బిల్లు కారణంగా ౩౦ కోట్ల మంది భూమిలేని ప్రజలకు అంటే పేదలకు, దళితులకు, అణగారిన వర్గాలవారికి పారిశ్రామిక రంగంలో ఉపాధి దొరుకుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
తాము తెస్తున్న భూసేకరణ బిల్లును ఆయన బ్రహ్మాండంగా అభివర్ణించారు.ప్రజలకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కూడా చెప్పారు.
మాటలు బాగానే ఉన్నాయి.కాని ౩౦ కోట్ల మందికి ఉపాధి కల్పించడమంటే మాటలు కాదు.
కార్మిక చట్టాలనే యజమానులకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందంటే నమ్మశక్యమా? ఇది నిజంగా నిజమా?
.