బోరు బావిలో పడి చిన్నారి మృతి… ఇప్పటి వరకు ఈ మాట చాలా సార్లు వినిపించి ఉంటుంది.తరుచుగా దక్షిణాది రాష్ట్రాలలో ఇలాంటి ఘోరాలు గ్రామీణ ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి.
సంఘటన జరిగాక వీటి గురించి ఆలోచించే ప్రభుత్వాలు, సంఘటన జరగకుండా ఆపడానికి మాత్రం పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించవు.బోరు బావి తవ్వే సమయంలో గాని, దాని తీసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కాని ఎలాంటి సూచనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వేసి వదిలేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు తరుచుగా చూడాల్సి వస్తుంది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో నిన్న సాయంత్రం మూడేళ్ళ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.అతనిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో ఆ మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 12 గంటలపాటు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది.
బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో గొయ్యి తవ్వి బాలుడిని వెలికి తీశారు.అయితే, అప్పటికే బాలుడు మృతి చెందాడు.
అనంతరం సాయివర్ధన్ మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
గ్రామంలో విషాదం నెలకొంది.పంటపొలంలో బోరుబావి వేసిన అరంగంటకే సాయివర్ధన్ అందులో పడిపోయాడు.
పొలం వద్ద బాలుడుని పట్టించుకోకుండా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోవడంతో ఈ ఘటన జరిగింది.