బోరుబావిలో పడి చాలా మంది పిల్లలు తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం తరుచూ చూస్తున్నాం.అయినా ప్రజల్లో చైతన్యం రాకపోవడంతో కొందరు నీళ్ల కోసం వేసిన బోరుబావులను అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.
ఈ బోరుబావుల కారణంగా పలువురు తల్లులకు కడుపుకోత మిగులుతోంది.తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు.
గోవర్ధన్ అనే రైతు పోడ్చన్పల్లిలోని తన అమ్మమ్మ ఇంటికి నాలుగేళ్ల క్రిందట వచ్చాడు.
మామ మంగలి బిక్షపతికి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మూడు బోర్లను వేయగా వాటిని చూసేందుకు కుటుంబ సమేతంగా వెళ్లాడు.ఈ క్రమంలో వాటిని పూడ్చేందుకు బుధవారం సాయంత్రం తన భార్య నవీనతో పాటు మూడేళ్ల సాయి వర్ధన్తో కలిసి పొలానికి వెళ్లాడు.
అయితే సాయి వర్ధన్ ఆడుకుంటూ వెళ్లి 120 అడుగుల బోరుబావిలో పడిపోయాడు.ఇది ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని బోరుబావిలో చూడగా అతడి ఏడుపు వినిపించింది.
కాగా స్థానికుల సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులు నాలుగు జేసీబీలతో ఆ బాలుడిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీలు రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.కాగా బాలుడికి ఆక్సిజెన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.