పంజాబ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వగా .మృతుల్లో ముగ్గురు ప్రవాస భారతీయలు వున్నట్లు పోలీసులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున ఛండీగడ్- అంబాలా రహదారిపై డేరా బస్సీ సమీపంలో రెండు కార్లు ఢీకొనడంతో నాలుగు నెలల పాప సహా నలుగురు వ్యక్తులు మరణించారు.ఈ ఘటనలో మరణించిన ప్రవాస భారతీయులను హర్జీత్ కౌర్ ధామి (56), ఆమె కోడలు శరంజీత్ కౌర్ (33), ఆమె నాలుగు నెలల మనవడు అజైబ్ సింగ్గా గుర్తించారు.
మరో మృతుడిని హర్యానా రాష్ట్రం పానిపట్లోని వాధ్వా రామ్ కాలనీకి చెందిన గౌరవ్ కుమార్గా గుర్తించారు.
జానెత్పూర్ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.హర్యానా రిజిస్ట్రేషన్ గల మారుతీ స్విఫ్ట్ కారు .అతి వేగంగా వెళుతూ , మొహాలీకి చెందిన ఐదుగురు సభ్యుల ఎన్ఆర్ఐ కుటుంబం ప్రయాణిస్తోన్న మారుతీ ఎర్టిగా క్యాబ్ను ఢీకొట్టింది.ఫరీదాబాద్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొని ఈ ఫ్యామిలి తిరిగి ఇంటికి వస్తోంది.
డేరా బస్సీ ఎస్హెచ్వో కుల్బీర్ సింగ్ మాట్లాడుతూ.ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన ఐదుగురు ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు కెనడా నుంచి భారత్కు వచ్చారు.మారుతి ఎర్టిగాలో ప్రయాణిస్తోన్న ఎన్నారైలలో ఒకరైన దేవిందర్ సింగ్ ధామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.చండీగఢ్ వైపు నుంచి వస్తున్న స్విఫ్ట్ కారు డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తొలుత గాయపడిన వారందరినీ పోలీసులు డేరా బస్సీలోని ఓ ఆసుపత్రికి తరలించారు.అయితే హర్జీద్ కౌర్, శరంజీత్ కౌర్, అజైబ్ సింగ్లు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మిగిలిన క్షతగాత్రుల పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.