మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన గ్రామానికి చెందిన మహిళలు చేసిన మంచి పనికి వార్తల్లోకి ఎక్కారు.గ్రామంలో నీటి సమస్య తలెత్తడంతో ఆ గ్రామ మహిళలు 18 నెలలు కష్టపడి ఓ కొండను తవ్వారు.
అర కిలోమీటరు వరకు కొండను తవ్వి నీటికి మార్గాన్ని సులభతరం చేశారు.దీంతో ఆ గిరిజన గ్రామానికి నీటి సమస్య పరిష్కారమైంది.
ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా తామే స్వంతంగా పనులు చేపట్టడంతో పలువురు ఆ గ్రామ మహిళలను ప్రశంసించారు.
నీటి కోసం ఏకంగా కొండనే తవ్విన ఘటన మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ జిల్లా అంగ్రోతా గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన 250 మంది మహిళలు, 18 నెలలు కష్టపడి నీటి సమస్యను పరిష్కరించుకున్నారు.అయితే ఈ గ్రామ పొలిమేరలో నీరున్నా ఆ నీరంతా అడవిలో ప్రవహిస్తుంది.
కనీస అవసరాలకు, మూగ జీవాలకు తాగడానికి కూడా ఈ గ్రామంలో నీరు దొరకడం లేదు.తాగు నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది.దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈ కష్టాలను చరమగీతం పాడాలనుకున్నారు గ్రామ మహిళలు.గ్రామానికి నీటి సరఫరా అవ్వాలంటే కొండ అడ్డు.దీంతో కొండను తవ్వాలని ఫిక్స్ అయ్యారు.18 నెలల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని బండరాళ్లను సుత్తితో పగులగొట్టి కాలువను ఏర్పాటు చేశారు.కాలువ ద్వారా నీరు చెరువులోకి రావడంతో గ్రామంలో నీటి సమస్య పరిష్కారం అయింది.గ్రామ మహిళలంతా సమూహంగా ఏర్పడి.కొండను అర కిలోమీటర్ వరకు తవ్వి గ్రామంలోని చెరువులోకి నీరు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పుడు నీటి సమస్య పరిష్కారమైందని బబితా రాజ్ పుత్ అనే మహిళ తెలిపింది.