మన భారత దేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాగే ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువులను వాడటం లోనూ ఇండియన్స్ ముందుంటారు.
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకంలో భారతదేశాన్ని ఏ దేశం బీట్ చేయలేదనే చెప్పాలి.కరోనా సమయంలోనూ ఇండియాలో కోట్లాది స్మార్ట్ ఫోన్స్ అమ్ముడుపోయాయంటే అతిశయోక్తి కాదు.
ఇండియాలో ఒక్క 2020 సంవత్సరంలోనే 15 కోట్ల 20 లక్షల మొబైల్ ఫోన్స్ అమ్ముడయ్యాయి.ఈ రికార్డు 2021 సంవత్సరం బద్దలు కొట్టింది.2021 ఏడాది లో ఏకంగా 16 కోట్ల 90 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి.ఈ విషయాన్ని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది.
దీంతో అందరూ అవాక్కవుతున్నారు.మరి ఒకే ఏడాదిలో ఒకే దేశ ప్రజలు దాదాపు 17 కోట్ల స్మార్ట్ ఫోన్స్ కొనడం అంటే మామూలు విషయమా!
ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్ లో శాంసంగ్, రియల్ మీ, షియోమీ, వన్ప్లస్ సహా అన్ని మొబైల్స్ భారీ ఎత్తున అమ్ముడుపోతాయి.
అందుకే స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు భారత యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఫోన్లను తయారు చేస్తుంటాయి.ఇండియాలో 2021లో రూ.10,000 – రూ.20,000 రేంజ్ స్మార్ట్ఫోన్లే ఎక్కువగా అమ్ముడయ్యాయి.మొత్తం ఫోన్ విక్రయాల్లో వీటి వాటా 47 శాతంగా ఉందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.రూ.10,000, అంతకన్నా తక్కువ ధర ఉన్న స్మార్ట్ఫోన్లు కూడా అధికంగానే అమ్ముడయ్యాయి.మొత్తం విక్రయాల్లో వీటి వాటా 30 శాతంగా ఉంది.
ఇక మిగతా హై రేంజ్ ఫోన్లు కూడా గత ఏడాదితో పోలిస్తే అధికంగా విక్రయించబడ్డాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తెలిపింది.2021లో భారతదేశంలో వన్ ప్లస్ 9, రెడ్మీ నోట్ 10 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62, రెడ్మీ 9ఏ, ఒప్పో ఎఫ్19, ఐఫోన్ ఎస్ఈ, వివో వీ20 స్మార్ట్ఫోన్లు ఎక్కువగా సేల్ అయ్యాయని ఓ ప్రముఖ టెక్ వెబ్సైట్ వెల్లడించింది.