అమెరికాలో ఇద్దరు భారత సంతతి ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కింది.పులిట్జర్ బహుమతి గ్రహీత సిద్ధార్థ ముఖర్జీ, ఆర్ధికవేత్త రాజ్ చెట్టీ ప్రతిష్టాత్మకమైన గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ 2020 అవార్డుకు ఎంపికయ్యారు.
అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకున్న వలసదారులకు ప్రతి యేటా ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తారు.వీరితో పాటు 38 మంది వలసదారులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
న్యూఢిల్లీలో జన్మించిన ముఖర్జీ జీవశాస్త్రం, ఆంకాలజీ విభాగంలో సేవలందించారు.ఆయన రచించిన ‘ ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్స్’’ పుస్తకానికి పులిట్జర్ అవార్డు దక్కింది.
సిద్ధార్థ 2009 నుంచి కొలంబియా యూనివర్సిటీ అధ్యాపక విభాగంలో మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.దీనితో పాటు న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2014లో భారత ప్రభుత్వం సిద్ధార్థను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.కరోనా సంక్షోభ కాలంలో సిద్ధార్ధ్.
వైరస్ గురించి ప్రజలకు వ్యాసాలు, మీడియాకు ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఫోరమ్లు, అలాగే సోషల్ మీడియాతో ద్వారా అవగాహన కల్పించారు.సామాజిక దూరం, మాస్కులు ధరించడం, సెల్ఫ్ ఐసోలేషన్ వంటి వాటి ప్రాముఖ్యత గురించి సిద్ధార్థ ముఖర్జీ నొక్కి చెప్పారు.
ఈ క్రమంలో కోవిడ్ 19ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 15 మంది సభ్యుల బ్లూ రిబ్బన్ కమీషన్లో సిద్ధార్థకు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో చోటు కల్పించారు.
ఇకపోతే ఆర్ధిక నిపుణుడు రాజ్ చెట్టీ విషయానికి వస్తే.ఆయన కూడా న్యూఢిల్లీలోనే జన్మించారు.ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో పదవీని చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా రాజ్ గుర్తింపు పొందారు.
అమెరికా అంతటా ప్రజలు, వ్యాపార, ఇతర సంఘాలపై కరోనా ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు గాను ఆయన ప్రభుత్వానికి సాయం చేశారు.అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4ని పురస్కరించుకుని, కార్నెగీ కార్పోరేషన్… గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ అవార్డును అందజేస్తుంది.
దీని వ్యవస్థాపకుడు ఆండ్రూ కార్నెగీ స్కాటిస్ వలసదారుడు.పేదరికం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన వలసదారుల గొప్పతనాన్ని చాటి చెప్పారు.
ఈ ఏడాది గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ అవార్డుకు ఎంపికైన వారిలో మూడవ వంతు మంది నర్సులు, వైద్యులు కావడం విశేషం.వీరితో పాటు మానవహక్కులు, కంప్యూటర్ సైన్స్, కళ, వ్యాపారం, విద్య, ఆరోగ్య సంరక్షణ, జర్నలిజం, సంగీతం, రాజకీయాలు, మతం, పరిశోధన వంటి రంగాలకు చెందిన 35 దేశాల వలసదారులున్నారు.