ఎన్నికల వేడి అన్ని పార్టీల్లోనూ రగులుతోంది.క్షణం తీరిక లేకుండా పార్టీ అధినాయకత్వం నిత్యం రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో బిజీ అయిపోయారు.
ఇక పార్టీ టికెట్లు ఆశించే నేతల సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు.వీరితో పాటు సిట్టింగ్ ఎమ్యెల్యేలు అయితే టికెట్ మళ్ళీ తమకే దక్కేలా … అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక పలు సర్వే సంస్థలు ఇప్పటికే వాటి పని మొదలుపెట్టేశాయి.ఈసారి మీ ఓటు ఏ పార్టీకి వేయబోతున్నారు.? ఎందుకు వేయబోతున్నారు అంటూ అనేక ప్రశ్నలతో ప్రజల ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి.
ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల మధ్యే ఎన్నికల పోరు హోరాహోరీగా సాగేలా ఉంది.
అదీ కాకుండా గత ఎన్నికల్లో ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లాయి.కానీ ఈ సారి ఆ అవకాశం కనిపించేలా లేదు.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధం అయ్యాయి.
బీజేపీ, జనసేన పార్టీలతో తెగతెంపుల వల్ల కాస్తోకూస్తో వాటిల్లే నష్టాన్ని కూడా ముస్లిం ఓటర్లు, దళిత ఓటర్ల అండతో నివారించవచ్చనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది.ఏపీలో దాదాపు 25శాతం ఓటు బ్యాంకు దళితులదే కావడం గమనార్హం.ముస్లిం ఓటర్లు కూడా 11శాతం మంది ఉన్నారు.
అంటే.దాదాపు 35శాతానికి పైగా ఓటు బ్యాంకు దళిత, ముస్లిం ఓటర్లదే కావడం విశేషం.
దీంతో 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు టీడీపీ దళిత, ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పైగా చంద్రబాబు సారథ్యంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ తొలిసారి ఎన్నికల బరిలో కి వెళ్లబోతోంది.
వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది.అయితే జగన్ అతి విశ్వాసం పార్టీకి నష్టం చేస్తుందనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన.ఏ ప్రతిపక్షమైనా అవకాశం ఉన్నప్పుడు ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తోందని.జగన్ పార్టీకి అలాంటి అవకాశం వచ్చినప్పటికీ కాదనుకోవడం అతి విశ్వాసమేనని అంటున్నారు.2014లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో లెఫ్ట్ పార్టీలు జగన్ పార్టీ వైపు చూశాయని, అయితే జగన్ పొత్తుకు సుముఖత చూపకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయని తెలుస్తోంది.
పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలు, కాపు రిజర్వేషన్లపై చేసిన ప్రకటన.
ఈ రెండు అంశాలు ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జనసేన విషయానికొస్తే.2019 ఎన్నికల్లో పవన్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే.
జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోపంగా కనిపిస్తోంది.