20 ఏళ్ల వయసంటే ఎవరో ఒకరిద్దరు తప్ప గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కూడా కష్టమే.అలాంటిది ఆ వయసుకే పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు ఇద్దరు భారత సంతతి యువకులు.
అమెరికాలో స్థిరపడిన సమీర్ వాసవాడ, రునిక్ మెహోత్రాలు ప్రారంభించిన ఏఐ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘వైజ్’ ఈ వారం ప్రారంభంలో 45 మిలియన్ డాలర్ల సిరీస్ ‘బీ’ నిధులను అందుకుంది.
ఇన్వెస్టర్లు వీరికి చెక్కులు రాసేందుకు ఇప్పుడు ఉత్సాహం చూపించవచ్చు.
కానీ ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలోని బిలియనీర్ వినోద్ ఖోస్లా సహా సుమారు 1000 మంది పెట్టుబడిదారులు ‘వైజ్’లో ఇన్వెస్ట్ చేసేందుకు తిరస్కరించిన గడ్డు పరిస్ధితులను వీరు ఎదుర్కొన్నారు.
వాసవాడ క్లీవ్లాండ్ , మెహోత్రా డెట్రాయిట్లో పెరిగారు.వీరద్దరూ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో ఓ సమ్మర్ రీసెర్చ్ క్యాంప్లో కలుసుకున్నారు.2019లో వైజ్ను ప్రారంభించిన వీరిద్దరూ 16 ఏళ్ల వయసు నుంచే కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు.
ఖోస్లా సహా అనేకమంది వాసవాడ, మెహోత్రాలకు పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించారు.అయినప్పటికీ నిరాశ చెందని వీరిద్దరూ ఆ తర్వాత పేపాల్ సహ వ్యవస్థాపకుడు, ఫౌండర్స్ ఫండ్లో భాగస్వామి అయిన కీత్ రాబోయిస్, బ్లింగ్ కేపిటల్కు చెందిన బెన్ లింగ్ల నుంచి 2 మిలియన్ డాలర్లను సేకరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంపై మంచి పట్టున్న వీరిద్దరూ వ్యాపార సంస్థలు, పెట్టుబడి బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియర్లకు సేవలందిస్తున్నారు.ఈ వ్యాపారంలో 50 మిలియన్ డాలర్ల సంపదను దాటిన తర్వాత న్యూయార్క్లోని వైజ్ కార్యాలయాన్ని విస్తరించాలని రునిక్, వాసవాడలు నిర్ణయించారు.
ట్రిలియన్ల విలువైన మార్కెట్ వున్న ఈ పరిశ్రమలో మరింత విస్తరించాలని వైజ్ లక్ష్యంగా పెట్టుకుంది.