ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు … గోపీ ( గోడమీద పిల్లులు) ల సందడి ఎక్కువయిపోతుంది.ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .
ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఇలా ఇష్టం వచ్చినట్టు జంపింగ్ లు చేసేస్తుంటారు.పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఒకరు… తాము చెప్పిన వారికి ఇవ్వలేదని మరొకరు… సిటింగ్ లకూ సీట్లివ్వలేదని ఇంకొకరు.
ఇలా ఎవరికి వారు ఏదో ఒక వంకతో తమకు మెరుగైన రాజకీయ భవిషత్తు కోసం ప్రాకులాడుతుంటారు. తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ దాదాపు ఇదే సీన్ కనిపిస్తోంది.
ఎన్నికల సమయంకంటే ముందుగానే టీఆర్ఎస్ ఇటువంటి గోపీలకు గేలం వేసి పట్టుకుంది.అన్ని పార్టీల్లోనూ ఉన్న ఒక మోస్తరు ముఖ్యమైన నాయకులందరినీ తీసుకువచ్చి కారెక్కించేసారు.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తాజాగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చేసుకున్నారు.దీంతో పాటే … దాదాపు వారం క్రితమే ఇద్దరు కీలక నేతలు తమ పార్టీలోకి వస్తారని మరిన్ని సంచలనాలుం టాయని రేవంత్ ప్రకటించినప్పుడు రెండు, కాదు మూడు అని రెట్టించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కేటిఆర్ ఫోన్ కాల్ తో కాస్త మెత్తబడ్డారు.కేసిఆర్ ఆదేశాల మేరకు కేటిఆర్ స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారొద్దంటూ బతిమిలాడారు .దీంతో తాను పార్టీ మారడం లేదు అంటూ ఆయన ప్రకటించేశారు.
కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ నుంచి జంపింగ్ చేసిన నేపథ్యంలో …ఆ తరువాత ఇంకెవరు ఇంకెవరు అనే చర్చ కూడా జరుగుతోంది.అంతేకాదు… టీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగులకు సీట్లు గల్లంతవడం కూడా పార్టీ మార్పుకి కారణం అవుతోంది.టీఆర్ఎస్ కు చెందిన రమేష్ రాథోడ్ కు సీటు దక్కకపోవడంతో… ఆయన కాంగ్రెస్ లో చేరి టిక్కెట్ పొందారు.
అలాగే పరకాల సీటు కోసం పట్టుబట్టిన కొండా సురేఖ ఆ తరువాత టీఆర్ఎస్ తో విభేదించి చివరకు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.అదే బాటలో గజ్వేల్ టిక్కెట్ కోసం నర్సారెడ్డి, దేవర కొండ సీటుకోసం బాలూనాయక్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
అలాగే ఆందోల్ టిక్కెట్ కోసం బాబూ మోహన్ బిజెపిలోకి మారిపోయారు.అదే బాటలో బొడిగ శోభ కూడా బిజెపి గూటికి చేరారు.ఇక కాంగ్రెస్ కోరుట్ల సీటు ఆశించి కొంత ప్రచారం కూడా చేసుకున్న వెంకట్ బిజెపిలో చేరిపోయారు.