ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.
గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
తమ వద్ద పనిచేసేవారి వీసాలు, పాస్పోర్టులను బలవంతంగా లాక్కొని సరైన వేతనాలు ఇవ్వడం లేదు.
ఎక్కువ వేతనాలు అడిగితే వేధింపుల పర్వమే.వీసాలు, పాస్పోర్టులు లేకుండా అక్రమంగా ఉండటం వల్ల యాజమానులతో సమస్యల కారణంగా ఏటా సగటున 12వేల మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు.
లక్షల మంది అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారు.వేలమంది భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తున్నారు.
విదేశాల్లో వారికి బీమా లభించడం లేదు.ఉద్యోగ భద్రత గురించి అడిగే ధైర్యం వారికీ లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా భయమే! స్థానికంగా రాయబార కార్యాలయాలు ఉన్నా, ఆశించిన రీతిలో అవి బాధితులను ఆదుకోలేకపోతున్నాయి.గల్ఫ్దేశాల్లో సుమారు 30 శాతానికిపైగా భారతీయ కార్మికులే.
అక్కడి అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో వారిది కీలకపాత్ర.
తాజాగా ఇద్దరు భారతీయులు సౌదీ అరేబియాలో యజమాని దగ్గర బంధీలుగా మారి నరకయాతన అనుభవిస్తున్నారు.
రాజస్థాన్కు చెందిన వీరి గురించి కాంగ్రెస్ వెలుగులోకి తీసుకొచ్చింది.వీరిని రక్షించాలంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్లోని బుండి, భరత్పూర్ జిల్లాకు చెందిన గఫర్ మొహమ్మద్ (49), విశ్రామ్ జాతావ్ (46) మూడేళ్ల క్రితం కాంట్రాక్ట్ వర్క్పై సౌదీ వెళ్లారు.ఈ ఒప్పందం 2020 నవంబర్తో ముగిసింది.
దీంతో తమను స్వదేశానికి పంపించాల్సిందిగా యజమానిని వీరు అభ్యర్ధించారు.
అయితే వీరిని సదరు యజమాని వీరిని బంధీంచినట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.ఏప్రిల్ 3, 2021న వీరి సమస్యపై ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్కు ఫిర్యాదు చేయగా.అదే నెల 26న ఈ కేసును మూసివేశారని కాంగ్రెస్ బుండి జిల్లా ఉపాధ్యక్షుడు చార్మేష్ శర్మ తెలిపారు.
నాలుగు రోజుల క్రితం తాను వారిద్దరితో ఫోన్లో మాట్లాడానని.అక్కడి తమ దుస్థితిపై వారు తనకు చెప్పి వాపోయారని శర్మ వెల్లడించారు.తోటి కార్మికుల సాయంతో వారు ఏదో విధంగా నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు.ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.
ఇద్దరు భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసినట్లు చార్మేష్ శర్మ పేర్కొన్నారు.