వినోదం, మీడియా, వ్యాపారం, పెట్టుబడి, రాజకీయాలు మొదలైన రంగాల్లో ప్రభావవంతులైన 50 మంది జాబితాలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు మనీ మ్యాగజైన్లో చోటు దక్కింది.వీరు అమెరికన్ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో సేవ చేస్తున్నారు.
వీరిలో ఒకరు కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సీఎఫ్పీబీ) అధిపతి రోహిత్ చోప్రా కాగా, మరొకరు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్టెక్ సంస్థ క్యాపిటలైజ్కు చెందిన గౌరవ్ శర్మ. ప్రభుత్వ సీఎఫ్పీబీ డైరెక్టర్గా 40 ఏళ్ల రోహిత్ చోప్రా… మోసపూరిత, దుర్వినియోగ ఆర్ధిక పద్ధతుల నుంచి కుటుంబాలను రక్షించే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేత సీఎఫ్పీబీ డైరెక్టర్గా రోహిత్ నియమితులయ్యారు.సీఎఫ్పీబీ డైరెక్టర్గా, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడి గానూ రోహిత్ చోప్రా వ్యవహరిస్తున్నారు.2018 నుంచి ఫెడరల్ ట్రేడ్ కమీషన్లో పనిచేస్తున్న రోహిత్ చోప్రా… అదే పనిగా నేరం చేసే నేరస్థులపై విధించే ఆంక్షలను బలోపేతం చేశారు.అలాగే మోసపూరిత కేసుల్లో మనీ నో ఫాల్ట్ సెటిల్మెంట్లపై ఏజెన్సీ ఆధారపడటాన్ని తిప్పికొట్టేలా ఆయన క్రీయాశీలకంగా వ్యవహరించారు.
దీనిలో చేరడానికి ముందు గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అయిన మెకిన్సే అండ్ కంపెనీలో రోహిత్ చోప్రా పనిచేశారు.
అక్కడ ఆర్ధిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, కన్జ్యూమర్ టెక్నాలజీ రంగాల్లో విధులు నిర్వర్తించారు.ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఇక గౌరవ్ శర్మ విషయానికి వస్తే.
ఆస్ట్రేలియాలో పుట్టిన ఆయన క్యాపిటలైజ్ సీఈవో, కో ఫౌండర్.న్యూయార్క్లోని వెంచర్ బ్యాక్డ్ ఫిన్టెక్ కంపెనీ అయిన ఈ సంస్థ రిటైర్మెంట్ సేవింగ్స్ మార్కెట్పై దృష్టి సారించింది.
క్యాపిటలైజ్ని స్థాపించడానికి ముందు గౌరవ్ శర్మ. జేపీ మోర్గాన్ , మోర్గాన్ స్టాన్లీ, గ్రీన్లైట్ క్యాపిటల్లో పనిచేశారు.