తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజేతగా నిలవడంతో టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం పెరగడానికి కారణం అయ్యింది.ఇక తెలంగాణాలో తమకు ఎదురే లేదు అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్ళింది.
అయితే ఆ దుకుడుకి బ్రేకులు పడడానికి ఎంతో సమయం పట్టలేదు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలూ తమవే అని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పెద్దలు ఫలితాలు తరువాత షాక్ కి గురయ్యారు.
అంతే కాదు సాక్షాత్తు అధినేత కేసీఆర్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ కవిత కూడా ఓటమి చెందడంతో ఆ పార్టీలో కలవరం తీవ్రం అయ్యింది.ఇదే సమయంలో తెలంగాణాలో పెద్దగా ప్రభావమే చూపించాడని భావించిన బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం టీఆర్ఎస్ పెద్దలకు నిద్ర లేకుండా చేసిందనే చెప్పాలి.
సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో గులాబీ పార్టీలో భయం మొదలయినట్టుగా కనిపిస్తోంది.
తెలంగాణలో మొదలైన బోనాల సందడి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల గులాబీ జెండా ఎగరాలని ఆశపడుతున్నారు కేసీఆర్.దీని కోసం ఇప్పటికే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లతో మీటింగులు కూడా పెట్టారు.అంతేకాదు మున్సిపల్ ఎన్నికల కోసం ఏకంగా 69 మంది ఇంచార్జిలను కూడా నియమించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం కూడా చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సీరియస్ వార్నింగ్ లు కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ లోక్ సభ స్థానాలు కోల్పోయిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నేతలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి.
ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో బీజేపికే అనుకూల ఫలితాలు వచ్చాయి.ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తే ఏంటి పరిస్థితి అనే ఆందోళన టీఆర్ఎస్ పెద్దల్లో కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లోని నాయకులకు టార్గెట్ లు పెట్టారు.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు.ఇప్పుడు వీరికి మున్సిపల్ ఎన్నికలు ప్రధాన టార్గెట్ గా పెట్టారట కేసీఆర్.
రాబోయే మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటముల ప్రభావం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.అంతేకాదు వీరికి తోడు సీనియర్లు, ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ను తేల్చబోతున్నాయట.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలంటే బాగా భయంపట్టుకున్నట్టే కనిపిస్తోంది.