ఏపీలో అధికారం పోగుట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు లేక దిక్కుతోచని స్థితిలో తెలంగాణ తమ్ముళ్లు పక్క చూపు చూస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం నామమాత్రం అని తేలిపోవడంతో పాటు బలమైన రాజకీయ శత్రువు కేసీఆర్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ముందే గ్రహించిన బాబు అసలు టి.టీడీపీ గురించి ఆలోచనే చేయకుండా గాలికి వదిలేసినట్టే వదిలేసారు.భవిష్యత్తులోనూ తెలంగాణాలో పార్టీ పుంజుకోవడం అసంభవం అని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.దీనికి తోడు ఏపీలో కూడా పార్టీ అధికారం కోల్పోవడంతో వీరంతా డీలా పడిపోయారు.
ప్రస్తుతం చంద్రబాబు దృష్టి మొత్తం ఏపీ రాజకీయాల మీద పెట్టడం, తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టలేనని తెలంగాణ నేతలతో బాబు నేరుగా చెప్పేశారట.అధినేత నుంచి భరోసా వస్తుందని ఆశించిన నేతలకు నిరాశే మిగిలిందట.దీంతో పార్టీలో ఉన్న నేతలంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి త్వరలో మరో పార్టీలో చేరాలని భావిస్తున్నారట.అదే మరే పార్టీనో కాదు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ.
ఆ పార్టీలో చేరితేనే తమ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదని పైగా ఈ ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటుంది.అలాగే తెలంగాణ లో కూడా నాలుగు ఎంపీ సీట్లు రావడం, భవిష్యత్తులో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉండడంతో వీరంతా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట.
పార్టీ మార్పు అంశం గురించి తెలంగాణ టీడీపీ నాయకులంతా ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో రహస్య భేటి నిర్వహించినట్లు తెలుస్తోంది.అందులో ఒకేరోజు అందరూ టీడీపీకి రాజీనామా చేసి వెంటనే బిజేపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదే జరిగితే, ఇక తెలంగాణలో టిడిపికి ఉనికి లేకుండా పోతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, జంపింగ్ జపాంగ్లతో తెలంగాణపై చంద్రబాబు పూర్తిగా ఆశలు వదులుకున్నారని, అందుకే తెలుగు తమ్ముళ్లు పార్టీని వదిలి వెళ్ళిపోతామన్నా పెద్దగా ఆశక్తి చూపడంలేదని తెలుస్తోంది.
అందుకే ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులు ఇలా తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు.