ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రి మండలి ఏర్పాటులో కూడా సామజిక సమీకరణాల లెక్కలు పక్కాగా వేసుకుని మరీ మంత్రి మండలి ఏర్పాటు చేసింది.ఈ లెక్కల్లో జగన్ చూపించిన లాజిక్ అందరి ప్రశంసలు అందుకుంది.
జగన్ కు అత్యంత సన్నిహితులను కూడా పక్కనపెట్టి మంత్రివర్గ కూర్పు చేసాడు జగన్.అయితే ఇప్పుడు జగన్ తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు మంత్రులకు మింగుడుపడడంలేదట.
ఐదుగురు డిప్యూటీ సీఎంలు సహా మొత్తం 25 మంది కేబినెట్ కొలువుతీరింది.ఆదిలో బాగానే ఉన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ, కేబినెట్ మంత్రుల్లో అసంతృప్తి తీవ్రతరం అవుతోంది.
దీనికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
సహజంగానే జగన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలోనే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరికలు చేశారు.
అంతే కాదు దీనిని ఇప్పుడు అమలు చేయడం స్టార్ట్ చేశారు.ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక క్రమశిక్షణ, మంత్రులకు మరో క్రమశిక్షణ అంటూ ఆయన ప్రత్యేకంగా విభజించినట్టు సమాచారం.
వాస్తవంగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువగానే ప్రభుత్వం నుంచి సౌకర్యాలు లభించే మంత్రులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ అంతర్గతంగానే కాకుండా కేబినెట్ మీటింగ్లోనూ స్పష్టం చేశారట.ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా జగన్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక, అర్హతకు మించి సెక్యూరిటీ కింద పోలీసులను నియమించడాన్ని కూడా నిరోదించారు.ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్నవారిలో ఎక్కువమంది కొత్తవారే కాబట్టి పోలీసులను ఎక్కువ భాగం ప్రజల సమస్యలపైనే దృష్టిపెట్టేలా వ్యవహరించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మంత్రులు ఎవరికి వారు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రజాసమస్యలు పరిష్కరించే విషయంలో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా చూసుకోవాలని జగన్ పదే పదే ఆదేశాలు ఇస్తున్నాడు.ఈ పరిణామాలన్నిటిని కేబినెట్లోని జూనియర్ మంత్రులు జీర్ణించుకుంటున్నారు.కానీ సీనియర్ మంత్రులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.ఇప్పటివరకు పార్టీ కోసం ఆస్తులు కూడా అమ్ముకుని తాము ఖర్చు చేశామని, ఇప్పుడు అన్ని వైపులా తలుపులు మూసేస్తే మా పరిస్థితి మరింత దారుణం అయిపోతుందని వారంతా ఆవేదన చెందుతున్నారట.