ప్రపంచంలోని ఎన్నో దేశాల పౌరులకు అమెరికాలో స్ధిరపడాలని కల.అగ్రరాజ్యంలో కాలు పెట్టేందుకు చట్టరీత్యా అవకాశం లేకపోతే చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘించైనా అమెరికాకు చేరుకునేందుకు ప్రయత్నించేవారు లక్షల్లో ఉంటారు.
ఈ ప్రయాణంలో ఎంతో మంది మృత్యువాత పడినప్పటికీ కంచె దాటే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.తాజాగా శనివారం టెక్సాస్లోని ఎల్ పాసో సమీపంలో యూఎస్ సరిహద్దు గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ గ్వాటెమాలాకు చెందిన 19 ఏళ్ల గర్భవతి ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలిని మిరియన్ స్టెఫానీ గిరోన్ లూనాగా గుర్తించారు.ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి, ఈ క్రమంలో సుమారు 19 అడుగుల గోడ ఎక్కే ప్రయత్నంలో కిందపడిపోయి తీవ్రగాయాల పాలైంది.
ఆమెను గుర్తించిన పోలీసులు, సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.అక్కడ మిరియన్కు ప్రసవం చేయాలని వైద్యులు భావించినప్పటికీ సాధ్యం కాలేదు.తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ స్టెఫానీ మరణించింది.
మానవ అక్రమ రవాణా ముఠా బాధితురాలిని గోడ ఎక్కాల్సిందిగా బలవంతం చేసిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) తెలిపింది.
గిరోన్తో పాటు ఆమె భర్తను అక్రమ రవాణా ముఠాదారులు సరిహద్దుకు తీసుకెళ్లారని, చిమ్మచీకటిలో 19 అడుగుల ఎత్తున్న గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తూ గిరోన్ కింద పడిపోయిందని సీబీపీ తాత్కాలిక కమీషనర్ మార్క్ మోర్గాన్ మీడియాకు తెలిపారు.ఆ సమయంలో బోర్డర్ సెక్యూరిటీ ఏజెంట్లు ఆమెను ఆసుపత్రికి తరలించారని, కానీ దురదృష్టవశాత్తూ తల్లి, బిడ్డను కాపాడలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు గిరోన్ భర్తగా భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం టెక్సాస్లోని డెల్ రియోలో బోర్డర్ పెట్రోల్ అధికారుల ఆధీనంలో ఉన్నట్లు గ్వాటెమాల కాన్సుల్ టెకాండి పానియాగువా ఫ్లోర్స్ తెలిపారు.యూఎస్ సరిహద్దు గోడలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు గ్వాటెమాలా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.తీవ్రమైన అంతర్యుద్ధం, పేదరికంతో బాధపడుతున్న గ్వాటెమాల ఇతర మధ్య అమెరికా దేశాల ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ బోర్డర్ పెట్రోల్ అధికారులకు పట్టుబడుతున్నారు.