వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆన్లైన్ ద్వారా తరగతుల్లో పాల్గొనే అంతర్జాతీయ విద్యార్ధులు అమెరికా విడిచి వెళ్లాలంటూ యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై హర్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు న్యాయపోరాటానికి దిగాయి.
ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా 17 అమెరికా రాష్ట్రాలు సైతం కోర్టును ఆశ్రయించాయి.కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ట్రంప్ యంత్రాంగం చర్యను క్రూరమైనదిగా, చట్టవిరుద్ధమైనదిగా అభివర్ణించాయి.
మసాచుసెట్స్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైన ఈ వ్యాజ్యం ప్రకారం.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్, ఐసీఈలకు ఈ అధికారం లేకుండా నిషేధం విధించాలని రాష్ట్రాలు కోరాయి.కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, ఒరెగాన్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, వెర్మోంట్, వర్జీనియా మరియు విస్కాన్సిన్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.
ఈ రాష్ట్రాల తరపున 18 మంది అటార్నీ జనరల్స్ కూటమికి మసాచుసెట్స్ అటార్నీ జనరల్ మౌరా హీలే నాయకత్వం వహిస్తున్నారు.ఆర్ధిక వ్యవస్థకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్ధులకు మసాచుసెట్స్ నిలయమని హీలే తెలిపారు.వీరు అమెరికాలో జీవించడం, నేర్చుకోవడం కొనసాగించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఎఫ్-1, ఎం -1 వీసాలతో అమెరికాలోకి ప్రవేశించిన అంతర్జాతీయ విద్యార్ధులు ఆన్లైన్ ద్వారా తరగతులకు హాజరుకావొచ్చని ఐసీఈ మార్చి 13న మార్గదర్శకాలు జారీ చేసింది.వీటికి ప్రస్తుతం విడుదల చేసిన ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని ఆ రాష్ట్రాలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం వేలాది మంది అంతర్జాతీయ విద్యార్ధులు అమెరికా వచ్చి నివసించకుండా నిరోధిస్తుందని తెలిపాయి.తద్వారా సైన్స్, టెక్నాలజీ, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, విద్య వంటి రంగాలకు ఆర్ధిక హానిని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
మసాచుసెట్స్ ప్రతి ఏడాది పదివేల మంది అంతర్జాతీయ విద్యార్ధులకు ఆతిథ్యం ఇస్తుంది.ప్రస్తుతం 77,000 మంది స్టూడెంట్ వీసాలతో ఉన్నారు.ప్రతి ఏడాది వీరు 3.2 బిలియన్ డాలర్లను ఆర్ధిక వ్యవస్ధకు అందిస్తున్నారు.