ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు హెచ్చరించినట్లుగానే ఒమిక్రాన్ కలవరపాటుకు గురిచేస్తోంది.ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించగా.
మనదేశంలోనూ నాలుగు కేసులు వెలుగుచూశాయి.శనివారం ఒక్కరోజే రెండు కొత్త కేసులు రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.
గుజరాత్లో ఒకరికి, మహారాష్ట్రలో మరొకరికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి.వీరిద్దరూ కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన వారేనని అధికారులు చెబుతున్నారు.
అటు యూరప్లోనూ ఒమిక్రాన్ ఉద్ధృతి పెరుగుతోంది.బ్రిటన్లో దీని తీవ్రత ఎక్కువగా వుంది.
అక్కడ ఇప్పటివరకు 160 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలైన నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే వెలుగుచూశాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో బ్రిటన్ అప్రమత్తమైంది.అంతర్జాతీయ ప్రయాణికులపై మరోసారి కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది.
యూకేకు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.అలాగే నైజీరియా నుంచి వస్తున్న వారిని హోటళ్లకు తరలిస్తున్నామని యూకే ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని జావిద్ వెల్లడించారు.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ అప్రమత్తమయ్యారు.ఒమిక్రాన్పై ప్రస్తుతం వున్న వ్యాక్సిన్లు ఎంతవరకు ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకునే పనిలో వున్నట్లు ఆయన వెల్లడించారు.డిసెంబర్ 20న దేశంలో ఒమిక్రాన్ పరిస్థితులను మరోసారి పరీక్షిస్తామని బోరిస్ జాన్సన్ చెప్పారు.
ఇకపై బ్రిటన్కు వచ్చేవారు ప్రయాణానికి రెండు రోజులముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే… ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా వున్న నైజీరియా సహా ఆఫ్రికా తొమ్మిది దేశాలను రెడ్ లిస్ట్లో ఉంచింది.
కేవలం బ్రిటన్ పౌరులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు.