భారత్లో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి.టీనేజర్స్ మీద, మహిళల మీదనే కాదు, ఎనభై ఏళ్ల వృద్ధులు మొదలుకొని మూడేళ్ల పాపల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారు.‘నిర్భయ’ చట్టం చేశాక ఇంకా భయం లేకుండా తెగబడుతున్నారు.కాలేజీ పిల్లలే కాదు, స్కూల్లో చదువుకునే పిల్లలు సైతం అత్యాచారాలు చేయడమే కాకుండా సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు.
ఒకప్పుడు అత్యాచారాలు చాటుమాటుగా జరిగేవి.ఇప్పుడు పబ్లిగ్గా చేస్తున్నారు.
మొన్నీమధ్య పంజాబ్లో నడుస్తున్న బస్సులోనే పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి బస్సు పోతుండగానే బయటకు తోసేయడంతో ఆ బాలిక చనిపోయిన సంగతి తెలిసిందే.ఇది జరిగిన రెండో రోజే ఇలాంటి ఘటనే మరోటి జరిగింది.
ఏపీలో కొందరు స్కూలు పిల్లలు గర్భిణిపై అత్యాచారం చేశారు.ఇలా చెప్పుకుంటూపోతే కొల్లలుగా ఉన్నాయి.
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో మైనర్లు కూడా నిందితులుగా ఉన్నారు.ఇప్పటివరకు నేరం చేసిన మైనర్లకు పెద్దలకు మాదిరిగా శిక్షలు వేయడంలేదు.
జువనైల్ హోంకు పంపి సంస్కరిస్తున్నారు.కాని ఇప్పుడు మైనర్లు కూడా నేరాలు చేయడంలో, అత్యాచారాలు, హత్యలు చేయడంలో రాటుదేలుతున్నారు.
వారు ఉద్దేశపూర్వకంగానే నేరాలకు పాల్పడుతున్నారు.దీంతో జువనైల్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదహారేళ్ల వయసువారు, అంతకుమించి వయసున్నవారిని ‘పెద్దలు’గా పరిగణించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.దీంతో సీరియస్ నేరాల్లో వీరిని పెద్దలుగా పరిగణించి శిక్షలు వేస్తారు.ఇలాంటి నేరాల్లో పేదరికాన్ని కారణంగా చూపి వారికి మినహాయంపు ఇవ్వకూడదని మంత్రి మేనకా గాంధీ అన్నారు.‘పిల్లలు దేవుడు చల్లనివారే’ అనే కాలం పోయింది.కాలానుగుణంగా చట్టాలు మార్చాల్సిందే.కాని ఈ చట్టాన్ని ఉపయోగించి అమాయకులైన బాలలను వేధించకుండా చూడాలి.