కేరళకు చెందిన ఎన్ఆర్ఐ సజన్ మాథ్యూస్ (56) అలియాస్ సాజీ హత్య కేసులో అమెరికా పోలీసులు పురోగతి సాధించారు.ఈ హత్యతో సంబంధం వున్నట్లుగా అనుమానిస్తున్న 15 ఏళ్ల బాలుడిని టెక్సాస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
ఇతను మైనర్ కావడంతో వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించలేదు.అయితే బాలుడిపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు.నిందితుడు బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో దుకాణంలోకి చొరబడి కౌంటర్లో వున్న సజన్ను డబ్బులు డిమాండ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడటంతో సజన్ మరణించాడు.మృతుడు మెస్కైట్ స్ట్రిప్ షాపింగ్ సెంటర్లో బ్యూటీ సప్లై స్టోర్ నడుపుతున్న సంగతి తెలిసిందే.
కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మాథ్యూస్ని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.కేరళ రాష్ట్రం పాతనంతిట్టలోని చెరుకోల్లో సీపీ మాథ్యూ, సారమ్మ దంపతుల కుమారుడే మాథ్యూస్.
కోజంచెరి సెయింట్ థామస్ కాలేజీలో చదువు పూర్తి చేసిన ఆయన కువైట్ వెళ్లాడు.అనంతరం 2005లో కువైట్ నుంచి యూఎస్కి వలస వచ్చారు.
డల్లాస్ సెహియోన్ మార్ థోమా చర్చిలో సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.మాథ్యూస్కి భార్య మినీ, ఇద్దరు పిల్లలు వున్నారు.
మినీ.డల్లాస్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు.
మరోవైపు మాథ్యూస్ దారుణహత్య డల్లాస్లోని మలయాళీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా… తెలుగు రాష్ట్రాలకు చెందిన అరవపల్లి శ్రీరంగ (54)ను కూడా గత నెలలో దుండగుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.ఆయన అమెరికాలో ఆరెక్స్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అలాగే క్యాంప్ టెక్ గ్లోబల్ సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.న్యూజెర్సీ లోని ప్లెయిన్స్బరోలో శ్రీరంగ నివాసం ఉంటున్నారు.
అరవపల్లి 2014 నుంచి ఆరెక్స్ లేబోరేటరీస్కు సారథిగా వ్యవహరిస్తున్నారు.హత్యకు ముందు పెన్సిల్వేనియాలోని పార్క్స్ క్యాసినోలో అరవపల్లి శ్రీరంగ 10,000 డాలర్ల పందెం గెలిచినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది.
అంత పెద్ద మొత్తాన్ని గెలవడం గమనించిన జాన్ అనే దుండగుడు.శ్రీరంగను ఇంటి వరకు అనుసరించాడు.
అరవపల్లి ఇంటిలోపలికి వెళ్లిన తర్వాత జాన్ రీడ్ బ్యాక్డోర్ను పగులగొట్టి లోనికి ప్రవేశించాడు.ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో శ్రీరంగను జాన్ కాల్చిచంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.