అమెరికాలో స్థిరపడి రెండు చేతులా సంపాదించాలన్నది ఎంతోమంది భారతీయల కల.అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల కల్లలయ్యే పరిస్ధితులు దాపురించాయి.
ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులకు అమెరికా వెళ్లడం కష్టసాధ్యంగా మారింది.అయితే దొడ్డిదారినైనా సరే అగ్రరాజ్యంలో అడుగుపెట్టేందుకు సైతం భారతీయులు వెనకడుగు వేయడం లేదు.
ఈ క్రమంలో అక్కడి బోర్డర్ పెట్రోలింగ్ అధికారులకు పట్టుబడుతున్నారు.
తాజాగా మెక్సికో, బహమాస్ సరిహద్దు మీదుగా యూఎస్లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో 15 మంది భారతీయులు తప్పిపోయినట్లుగా స్థానిక పంజాబ్ నాయకుడు తెలిపాడు.
వీరిలో బహమాస్- అమెరికా సరిహద్దు దాటుతుండగా ఆరుగురు, మెక్సికో-అమెరికా సరిహద్దులో మరో తొమ్మిది మంది బాలురు తప్పిపోయినట్లు నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (నాపా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నం సింగ్ చాహల్ తెలిపారు.ఒక గంటలో అమెరికా సరిహద్దులోకి ప్రవేశిస్తామనగా 56 మందితో కూడిన ఈ బృందాన్ని మెక్సికో సైనికులు అడ్డుకున్నట్లు తప్పిపోయిన బాలుర కుటుంబాలు తెలిపాయి.
అదుపులోకి తీసుకున్న ఆరుగురు పంజాబీ బాలురను తర్వాత విడుదల చేయగా, వారు యూఎస్కు చేరుకున్నారు.మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చాహల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ బాలురు నికరాగువాలో దిగిన తర్వాత పంజాబ్లోని తమ కుటుంబసభ్యులతో మాట్లాడారు.గ్వాటెమాల నుంచి మెక్సికోకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నట్లు వారు సమాచారం అందించారు.మెక్సికోకు చేరుకున్న తర్వాతి నుంచి బాలుర ఆచూకీ తెలియరాలేదని చాహల్ చెప్పారు.తమ పిల్లలను సదరు కుటుంబాలు అమెరికాకు పంపించడానికి ఢిల్లీకి చెందిన ఏజెంట్కు ఒక్కొక్కరికి రూ.19.5 లక్షలు చెల్లించాయని సత్నం తెలిపారు.దీనితో పాటు మరి కొందరు ఏజెంట్లకు రూ.45 లక్షలు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.అంతేకాకుండా బాలుర దగ్గర వున్న డబ్బును కూడా ఏజెంట్ తీసుకున్నాడు.అమెరికాలోని నిర్బంధ కేంద్రాలలో కానీ ఫ్లోరిడాలో కానీ ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు.
ఇక ఆరుగురు పంజాబీ బాలురతో కూడిన మరో బృందం బహామాస్ ద్వీపం నుంచి తప్పిపోయంది.ఇది వాయువ్య కరేబియన్లోని స్వతంత్ర దేశం.ఇది ఫ్లోరిడా తీరం నుంచి 80 కిలోమీటర్ల ఆగ్నేయంలో ఉంటుంది.వీరు బహమాస్లోని ఓ హోటల్ నుంచి పంజాబ్లోని వారి కుటుంబాలతో మాట్లాడారు.తాము ఫ్లోరిడా మీదుగా యూఎస్ వెళ్తున్నట్లు చెప్పారు.అప్పటి నుంచి వీరితో సంబంధాలు మూసుకుపోయాయి.
కాగా మెక్సికన్ సరిహద్దుకు సమీపంలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయని చాహల్ తెలిపారు.పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన యువ భారతీయులు ప్రతిరోజూ యూఎస్-మెక్సికో సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తూ అధికారులకు పట్టుబడుతుండటం దురదృష్టకరమని చాహల్ అన్నారు.
మెక్సికన్, యూఎస్ అధికారులతో సంప్రదించి తప్పిపోయిన యువకుల జాడను తెలుసుకోవాల్సిందిగా సత్నం సింగ్ భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.