90 సెకన్లలో ఓ బ్యాంకుని దోపిడి చేయడం ఎంతవరకు సాధ్యం? సినిమాల్లో మాత్రమే చేయవచ్చు, అలాంటి సన్నివేశం తీసినా నమ్మడం కష్టమని అనుకుంటున్నారా? నిజంగానే జరిగింది.ఏదో సినిమా రైటర్ రాసినంత పకడ్బందీగా, వేగంగా 15 లక్షలు కొట్టేసారు.
ఇంకో విషయం ఏమిటంటే, కేవలం నలుగురు దొంగలే ఇంత పెద్ద పని ఇంత వేగంగా చేసారు.
సినిమాను తలపించిన ఈ సంఘటన పంజాబ్ లోని లుథియానాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే పోలిసు పోస్టుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందట.
సోమవారం గాల్లో కాల్పులు జరుపుతూ దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికి అక్కడ కేవలం ఆరుగురు ఉద్యోగస్తులు, ఒక కస్టమర్ ఉన్నారట.
ఒక దొంగ లాబిలో తుపాకిలతో నిల్చుంటే, ఒక దొంగ మెనేజర్ ని పట్టుకున్నాడు,మరో దొంగ క్యాషియర్ ని చూసుకుంటే, ఇక మిగిలిన దొంగ కొన్ని నిమిషాల క్రితం ఒక కస్టమర్ జమచేసిన 15 లక్షలు కాజేసాడు.సరిగ్గా అప్పుడే బ్యాంక్ లోపలికి వస్తున్న ఓ మహిళ బయటకి వెళ్ళి జనాలకి జరుగుతున్న విషయం చెప్పేలోపే 15 లక్షలతో పారిపోయారు ఆ దొంగలు.
సిసి కెమెరాల్లో చూస్తే అందరు ముసుగు ధరించి ఉన్నారు.ఆ రికార్డు ప్రకారం చూస్తే ఈ దొంగతనమంతా కేవలం 90 సెకన్లలో పూర్తయిపోయింది.
అయితే ఈ దొంగతనంలో ఉద్యోగస్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.వాళ్ళు బ్యాంకులోకి ప్రవేశించినప్పుడు సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం ఏంటి, కేవలం ఆరుగురు ఉద్యోగస్తులు మాత్రమే ఉండటం ఏంటి .ఇదేదో, రండి … వచ్చి దోచుకోండి అని దొంగలను ఆహ్వానించినట్టుంది అని అభిప్రాయపడుతున్నారు పోలీసులు.కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.