ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.ఇక చిన్న పిల్లలు సెల్ ఫోన్ ని ఎందుకు వాడుతారంటే.
గేమ్స్ ఆడటానికో లేదా వీడియోలు చూడటానికో వినియోగిస్తారు.కానీ టెక్నాలజీని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు ఓ 12 ఏళ్ల కుర్రాడు.
చిన్న వయస్సులో ఏకంగా మూడు యాప్స్ ని డెవలప్ చేశాడు.దీంతో అతిపిన్న వయస్కుడైన యాప్ డెవలపర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.
యూట్యూబ్ వీడియోలు చూసి సొంతంగా మూడు లెర్నింగ్ యాప్స్ తయారు చేశాడు.
ఆ కుర్రాడి పేరు కార్తికేయ జఖర్.
హర్యానాలోని ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తికేయ ఝజ్జర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు.కరోనా సమయంలో స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు.ఆ సమయంలో కార్తికేయకు ఆన్ లైన్ క్లాసుల కోసం తండ్రి అజిత్ సింగ్ రూ.10 వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు.అయితే కొన్ని కోడింగ్ ఫంక్షన్లు సడెన్ గా పనిచేయడం, ఫోన్ హ్యాంగ్ అవ్వడం జరిగేది.అప్పుడు యూట్యూబ్ చూసి సొంతంగా ఫోన్ బాగు చేయడం నేర్చుకున్నాడు.
ఈక్రమంలో యూట్యబ్ ద్వారా మరికొన్ని విషయాలు నేర్చకున్నాడు.అలా ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్లను రూపొందించినట్లు కార్తికేయ తెలిపాడు.
మొదటిది లూసెంట్ జికె ఆన్ లైన్ యాప్, రెండోది కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ బోధించేందుకు రామ్ కార్తిక్ లెర్నింగ్ యాప్, మూడోది శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్ లు రూపొందించినట్లు కార్తీక్ చెప్పాడు.ప్రస్తుతం 45 వేల మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాని తెలిపాడు.
కార్తికేయ జఖర్ సొంతంగా మూడు లెర్నింగ్ యాప్స్ రూపొందించడంతో అతడు గన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.అంతేకాదు అమెరికాలోని హర్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్కాలర్ షిప్ కూడా పొందడం గమనార్హం.కార్తికేయకు సరైన గైడెన్స్ ఉంటే ప్రపంచంలోని అనేక కంపెనీలకు యాప్స్ డెవలప్ చేయగలడని, దీని ద్వారా అతడు లక్షలు నుంచి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉందని అతని స్కూల్ టీచర్ తెలిపారు.