11 ఏళ్ల వయసంటే తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం తప్పించి వేరే వ్యాపకం తెలియదు.అలాంటి పిల్లలకు ప్రపంచం, కరోనా, లాక్డౌన్, క్వారంటైన్ వంటి మాటలు ఏం తెలుస్తాయి.
కానీ బ్రిటన్లో ఓ భారతీయ చిన్నారి మాత్రం తన వయసును కూడా మరిచిపోయి తోటి పిల్లల సంతోషం కోసం కష్టపడి ఇప్పుడు దేశంలో ఓ సూపర్ హీరోగా మన్ననలు అందుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.
బ్రిటన్లో స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల ఈశ్వర్ శర్మ అనే బాలుడు యోగాలో అరుదైన ప్రతిభ చూపాడు.ఈ విషయం ఏకంగా బ్రిటన్ ప్రభుత్వం దాకా వెళ్లడంతో ఆ చిన్నారిని గౌరవించాలని ప్రధాని నిర్ణయించారు.
దీనిలో భాగంగానే బోరిస్ జాన్సన్ డైలీ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్కు ఈశ్వర్ శర్మ ఎంపికయ్యాడు.ఆగ్నేయ ఇంగ్లాండ్లో కెంట్లోని సెవెనోక్స్లో నివాసముండే ఈశ్వర్ మూడేళ్ల ప్రాయం నుంచే యోగాపై ఇష్టం పెంచుకున్నాడు.
ప్రతిరోజు ఉదయం తండ్రి యోగా చేయడం గమనించిన ఈ చిన్నారి.ఆయనలాగే చేసేవాడు.
ఇలా చిన్నప్పటి నుంచే యోగాలో మెళకువలు నేర్చుకుని పట్టు సాధించాడు.తద్వారా ఈశ్వర్ ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ యోగా ఛాంపియన్గా నిలిచాడు.
అయితే లాక్డౌన్లో ప్రతిరోజూ టీవీలు, పేపర్లలో కరోనాకు సంబంధించిన వార్తలు చూసేవాడు.సాధారణ పరిస్ధితుల్లో వలె తోటి పిల్లలు ఆడుకునే పరిస్ధితులు లేకపోవడంతో వారిని సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.దీనిలో భాగంగా లాక్డౌన్ సమయంలో వర్చువల్గా ప్రతిరోజూ 14 దేశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు యోగా పాఠాలు బోధించేవాడు.ఈ విషయం బ్రిటన్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
దీంతో ఈశ్వర్ ప్రతిభను గుర్తించిన యూకే ప్రభుత్వం మంగళవారం ప్రధాని బోరిస్ జాన్సన్ డైలీ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్తో సత్కరించింది.లాక్డౌన్ సమయంలో వందలాది మంది పిల్లలకు యోగాతో ఈశ్వర్ ఆనందాన్ని ఇచ్చారని ప్రధాని అభినందించారు.కాగా, యూకే ప్రధాని డైలీ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అందుకున్న 1,646వ వ్యక్తి ఈశ్వర్ శర్మ.2014 ఏప్రిల్లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు.