థియేటర్కు వెళ్లిన వారు ఇంటర్వెల్ సమయంలో టైంపాస్ చేసేందుకు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణం.అయితే థియేటర్లోని విక్రయదారులు ఎంతచెబితే అంత ధర చెల్లించి దాన్ని కొంటారు ప్రేక్షకులు.
కానీ వారు తీసుకునే దానికి సరైన తూకం ఉందా లేదా అనేది ఎవరూ పట్టించుకోరు.తాజాగా జరిగిన ఓ ఘటనలో పాప్ కార్న్ అమ్మకంలో అవాక్కయ్యే అంశాలు వెలుగు చూశాయి.
తెలంగాణ రాష్ట్రంలోని స్వర్ణ కళామందిర్ థియేటర్లోని క్యాంటీన్లో పాప్కార్న్ 60 గ్రాములు రూ.40కు అమ్ముతున్నారు.అయితే తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా ఆ థియేటర్ను తనిఖీ చేసి ఆ క్యాంటీన్ బండారాన్ని బట్టబయలు చేశారు.వారు అమ్ముతున్న పాప్కార్న్ తూనికలో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.60 గ్రాములకు గాను 15 గ్రాములు తక్కువగా వారు అమ్ముతుండటం గుర్తించి సదరు క్యాంటీన్ నిర్వాహకుడికి రూ.10 వేల జరిమానా విధించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, రాష్ట్రంలో అనేక థియేటర్లలో ఇలాంటి మోసాలే జరుగుతున్నాయని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.మరి వాటిపై అధికారులు ఎందుకు దాడులు నిర్వహించడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తమకు ఫిర్యాదు వచ్చిన థియేటర్లపై మాత్రమే దాడులు నిర్వహిస్తున్నామంటూ అధికారులు చెప్పుకొచ్చారు.