వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణ నది లో ఉన్న అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయ్యింది.ముఖ్యంగా కరకట్టలో ఉన్న నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని కూల్చివేస్తారా మమ్మల్ని కూల్చమంటారా అంటూ నోటీసులు కూడా ఇచ్చింది.
అంతే కాదు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూడా వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి తాము వెనక్కి తగ్గేది లేదు అంటూ గట్టి సంకేతాలే ఇచ్చింది జగన్ సర్కార్.అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చివేయాలనే గట్టి పట్టుదలతో ఉంది ప్రభుత్వం.
ఇప్పటికే ఇచ్చిన నోటీసుల గడువు కూడా పూర్తవడంతో అసెంబ్లీ సమావేశాల తరువాత ఆ పనికి శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ వేసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం.
ఇదే సమయంలో కూల్చివేతకు కనుక ప్రభుత్వం సిద్ధం అయితే దాన్ని అడ్డుకుని సెంటిమెంట్ రగిల్చేందుకు టీడీపీ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది.కేవలం కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నివాసాన్ని కూల్చేయడానికి రెడీ అయినట్లు ప్రజల్లో విస్తృతంగా ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని టీడీపీ చూస్తోంది.దీంతో బాటు గతంలో కాంగ్రెస్ హయాంలోనే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారంటూ కొన్ని కట్టడాలను సాక్ష్యంగా చూపాలని కూడా భావిస్తోంది.
అలాగే రాష్ట్రంలో 74 వేల నిర్మాణాలు కృష్ణా, గోదావరి వంటి నదులపై నిర్మాణం అయ్యాయాయని వాటిని ఎలా కూలుస్తారో చెప్పాలని డిమాండ్ చేయాలని చూస్తోంది.వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా బాబు నివాస గృహాన్ని కూల్చడానికి వీల్లేదని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
అయితే ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాల గురించి ఆలోచించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.ఒకవైపు న్యాయస్థానంలో పోరాడటం మరో పక్క ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇప్పటికే టిడిపి శ్రేణులకు ఆదేశాలు వెళ్లిపోయాయి.ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలు ఇప్పటికే మీడియా సమావేశాలు పెట్టి వైసిపి కక్షసాధింపు ధోరణితోనే ముందుకు వెళుతుందని ఆరోపణలకు దిగిపోయారు.ఏపీలో ఉన్న నదీపరివాహక ప్రాంతాలన్నింటినీ పరిశీలిస్తే మొత్తం 74 వేల కట్టడాలు ఉన్నాయని, దీనిలో ప్రభుత్వ భవనాలు, పర్యాటక శాఖ భవనాలు, అతిధి గృహాలు, పేదల గృహాలు ఇలా చాలా ఉన్నాయని వాటన్నిటిని కూల్చుతారా అనేదానికి సమాధానం చెప్పాలని చెప్పాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.