గురువారం కర్ణాటక అసెంబ్లీ లో ఏమి జరుగుతుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూడగా ఎలాంటి రిజల్ట్ లేకుండా సభను తేలికగా ఈ రోజుకు స్పీకర్ వాయిదా వేశారు.దీనితో కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ఒక్కరోజు రిలాక్స్ అయ్యింది.
అయితే మరోపక్క అసలకే అవకాశం దొరికితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ కాసుకొని కూర్చున్న బీజేపీ కి మాత్రం స్పీకర్ నిర్ణయం మింగుడుపడడం లేదు.కావాలనే జాప్యం చేస్తూ సభను వాయిదా వేశారు అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో రాత్రంతా సభలోనే బైఠాయిస్తామని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప స్పష్టం చేస్తూ నిజంగానే రాత్రంతా కూడా సభలోనే నిద్రపోయారు.గురువారం రాత్రి అక్కడే పడుకున్న వారు తెల్లారి మార్నింగ్ వాక్ చేస్తూ ఉండడం తో అందరి దృష్టి వారిపై పడింది.సభ ఈ రోజుకి వాయిదా పడడం తో ఈ రోజు మధ్యాహ్నం 1:30 కు విశ్వాస పరీక్ష పూర్తి కావాలని గవర్నర్ సీఎం ని ఆదేశించినట్లు తెలుస్తుంది.దీనితో 11 గంటలకు మొదలయ్యే అసెంబ్లీలో ఎట్టిపరిస్థితుల్లో బల నిరూపణ జరిగేలా చెయ్యాలని చూస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.
మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం రెబెల్స్ను బుజ్జగించడానికి తుది ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది.మరో వారం రోజుల వరకు ఈ సంక్షోభాన్ని పొడిగించాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఉంది.మరి గవర్నర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం తో ఈ బల పరీక్ష ముగిసిపోతుందా,లేదా ఇలానే మరికొద్ది రోజులు కొనసాగుతుందా అన్న విషయం తేలిపోనుంది.