అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజల మనోభావాలకి విరుద్దంగా ఉంటున్నాడని, అనేక అభియోగాలలో ట్రంప్ ఉన్నాడని, అందుకుగాను ట్రంప్ ను అభిశంసించాలని కోరుతూ దాదాపు కోటికి పైగా ప్రజలు సంతకాలు చేశారు.ఈ వినతి పత్రాన్ని కాంగ్రెస్ ఉభయసభలకు చెందిన డెమొక్రాట్స్ సభ్యులు అందుకున్నారు.
ట్రంప్ ని అభిశంసించేందుకు తమ వద్ద కోటికి పైగా సంతకాలు ఉన్నాయని కాంగ్రెస్ సభ్యుడు అల్ గ్రీన్ తెలిపారు.
అల్ గ్రీన్ తో పాటుగా తొలిసారి కాంగ్రెస్ కి ఎన్నికైన మహిళా ప్రతినిధి రషిదా త్లయిబ్ కూడా ఈ వినతి పత్రాన్ని అందుకున్నారు.
మూవాన్, యాన్యువల్ వుమన్స్ మార్చ్ లాంటి సంస్థలు సేకరించిన కోటి సంతకాలతో కూడిన వినతి పత్రాలని రషిదా కి అందించారు.ఆమె గతంలోనే ట్రంప్ అభిశంసించదగిన నేరాలు చేశారా లేదా అన్నవిషయాన్ని నిర్ధారించడానికి సభా సంఘాన్ని నియమించాలని కోరుతూ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశ పెట్టారు.
రషిదా స్పందిస్తూ ప్రస్తుతం తమ దేశం చీకట్లో ప్రయాణిస్తోందని, ఈ సమయంలో తమకి ఇదొక ఆయుధంగా పనిచేస్తుందని ఆమె అన్నారు.ముల్లర్ కమిషన్ నివేదికను తాజాగా బయటపడటంతో కొందరు డెమోక్రాటిక్ సభ్యులు దీనిపై అభ్యంతరం తెలిపారని, ట్రంప్ న్యాయవ్యవస్థని సైతం అడ్డుకునేదుకు ప్రయత్నం చేశారని ఆమె విమర్శించారు.
దేశ ప్రజలు ట్రంప్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని.రాబోయే ఎన్నికల్లో తాజా పరిస్థితులు ట్రంప్ కి సరైన బుద్ది చెప్తాయని ఆమె హెచ్చరించారు.