అభివృద్ధిలో ఎంతవేగంగా తెలంగాణాని పరుగులు పెట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగా కృషి చేస్తున్నాడో అంతే స్థాయిలో విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాడు.ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో తీవ్రంగా కృషి చేసిన వ్యక్తులను పక్కన పెట్టడం పార్టీలో నాయకులకు రుచించడంలేదు.
ఇక విషయంలోకి వస్తే కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తయ్యింది.సాగునీటి సదుపాయం పరంగా తెలంగాణకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును అంతే ఘనంగా ప్రారంభించడానికి కేసీఆర్ ఏర్పాట్లు చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఘన కీర్తిని అంతా పొగుడుకుంటున్నారు.కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత వేగంగా పూర్తవ్వడానికి కారణమైన వ్యక్తిని గురించి ఎవరూ పట్టించుకోకపోవడం చర్చగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక పేరు, డిజైన్లు కూడా కేసీఆర్ మార్పించేసారు.అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా పనులు పూర్తికావడానికి కేసీఆర్ మేనల్లుడు అప్పటి మంత్రి హరీష్ రావు కృషి ఎనలేనిది.నిత్యం ఆయన ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షించారు.నీటిపారుదల అవసరాలు, పరిస్థితుల మీద మంచి అవగాహన శ్రద్ద ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.అయితేనేమి రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరీష్ హవా పూర్తిగా తగ్గిపోయింది.ఆయనకు మంత్రి పదవి కూడా దక్కలేదు.
సరిగ్గా ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది.ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు అంతా వస్తున్నారు.కానీ టీఆర్ఎస్ మంత్రులు అంతా కాళేశ్వరం కృషి వెనుక కేసీఆర్ కృషి అమోగం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కానీ ఈ ప్రాజెక్ట్ కు వెన్నుముకగా నిలిచిన హరీష్ రావు ప్రస్తావన ఎవరూ తీసుకురావడంలేదు.
హరీష్ రావు ప్రమోట్ అయితే కేటీఆర్ హవా కు ఎక్కడ గండిపడుతుందో అన్నఉద్దేశంతో హరీష్ రావు పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నట్టు పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.